నల్గొండ జిల్లాలోని హన్మకొండలో మరో దారుణం జరిగింది. చిన్నారుల భవిష్యత్కు బంగారు బాటలు వేయాల్సిన ఓ ఉపాధ్యాయుడే యముడిగా మారాడు. సభ్య సమాజం తలదించుకునేలా పది సంవత్సరాల బాలుడి గొంతు కోసి పారిపోయాడు. స్థానికంగా ఒక తండాలో ఉపాధ్యాయుడిగా పని చేస్తున్న నాగరాజు అనే టీచర్ ఈ ఘాతుకానికి ఒడిగట్టారు.
హన్మకొండకు చెందిన పదేళ్ళ ఉదయ కిరణ్ అనే బాలుడిని నాగరాజు అనే టీచర్ మంగళవారం గొంతు కోశాడు. దీంతో ఆ బాలుడు ప్రాణాపాయ స్థితిలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. దీనిపై ఉదయ్ కిరణ్ తల్లి మాట్లాడుతూ.. తన భర్త స్నేహితుడైన నాగరాజు ఈ దురాగతానికి ఒడిగట్టినట్టు చెప్పారు.
భర్త లేని సమయంలో నాగరాజు ఇంటికి వచ్చారన్నారు. ఆయన లేరని చెప్పగా, ఆయన వచ్చేంత వరకు వేచి చూస్తానని చెప్పడంతో నాగరాజుకు అనుమతి ఇచ్చినట్టు చెప్పారు. తాను పడకగదిలోకి వెళ్లి పేపరు చదువుతుండగా, నాగరాజు ఈ దారుణానికి పాల్పడినట్టు చెప్పారు.
తనకు అనుమానం వచ్చి చూడగా, బిడ్డ గొంతు నుంచి రక్తం కారుతుండటాన్ని గమనించి, నాగరాజును పట్టుకునేందుకు ప్రయత్నించినట్టు చెప్పారు. తన నుంచి తప్పించుకునేందుకు తనపై కూడా దాడి చేసి పరారయ్యాడని ఆమె వివరించింది.