దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర రెడ్డి దుర్మరణం అనంతరం తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు తనను, తన కుటుంబాన్ని టార్గెట్ చేశారని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు, ప్రజా భద్రతా కమిటీ ఛైర్మన్ డాక్టర్ కేవీపీ.రామచంద్రరావు ఆరోపించారు. ఈ అంశంపై ఆయన చంద్రబాబుకు మంగళవారం బహిరంగ లేఖ రాశారు.
ఇందులో చంద్రబాబు తీరును కేవీపీ ఎండగట్టారు. పదవుల కోసం ఎలాంటి గడ్డి కరవడానికైనా చంద్రబాబు సిద్ధమని తీవ్రమైన ఆరోపణలు చేశారు. బాబు, తాను రాజకీయాల్లోకి ఒకేసారి వచ్చిన సమకాలీకులమన్నారు.
1978 సంవత్సరంలో చంద్రబాబు ఆస్తి ఎంత ఉండేదని, ప్రస్తుతం ఆయన ఆస్తి ఏ మేరకు ఉందో అందరికీ తెలుసన్నారు. తనను అపఖ్యాతి పాలు చేయడం ద్వారా బలహీనపరచడం తక్షణావసరంగా చంద్రబాబు గుర్తించినట్లున్నారని ఆయన ఎద్దేవా చేశారు.
వైఎస్సార్ అనంతరం తనపై బురద జల్లేందుకే ఆయన ఎక్కువ సమయాన్ని వెచ్చిస్తున్నట్టుగా ఉందన్నారు. కాగా, ఈ లేఖలో తనపై విమర్శలు చేస్తున్న ఇతర తెదేపా నేతలపై కూడా కేవీపీ ఘాటైన విమర్శలు చేశారు.
స్వర్గీయ ఎన్టీఆర్ కుటుంబాన్ని చంద్రబాబు నాయుడు తన స్వార్థ రాజకీయం కోసం వాడుకున్నారని నిప్పులు చెరిగారు. ఎన్టీరామారావును నిర్వీర్యం చేసి లబ్ధి పొందిన చంద్రబాబు రాజకీయ ప్రత్యర్థులందరినీ జయించగలనని కలలు కనవద్దని సూచించారు.
తనపై తెదేపా నేతలు పనిగట్టుకుని విమర్శలు చేయడం వల్లే విధి లేని పరిస్థితుల్లోనే ఈ బహిరంగ లేఖను రాస్తున్నట్టు కేవీపీ వివరణ ఇచ్చారు. చంద్రబాబు నాయుడి కుమారుడు చేసే వ్యాపారాలన్నీ చట్టబద్ధమైతే, తన కుమారుడు చేసే వ్యాపారాలు అనైతికమా? అని కేవీపీ ప్రశ్నించారు.