ప్రధాన పేజి » వార్తలు » వార్తలు » ఏపీ న్యూస్ » అవసరమైతే ప్రభుత్వాన్ని కూల్చుతాం: దామోదర్ రెడ్డి (Govt | Rosaiah | Damodar Reddy | Telangana | Assembly | Budget | Boycutt)
తమ లక్ష్యం నెరవేరని పక్షంలో రాష్ట్రంలోని ముఖ్యమంత్రి కె.రోశయ్య ప్రభుత్వాన్ని కూల్చుతామని కాంగ్రెస్ పార్టీకి చెందిన తెలంగాణ ప్రాంత సీనియర్ నేత ఆర్.దామోదర్ రెడ్డి హెచ్చరించారు. అందువల్ల అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలను బాయ్కట్ చేయడం అనేది తమకు పెద్ద సమస్య కాబోదని ఆయన ప్రకటించారు.
దీనిపై ఆయన ఒక ప్రైవేట్ టీవీ ఛానల్తో మాట్లాడుతూ.. జస్టీస్ శ్రీకృష్ణ కమిటీ విధి విధానాలను ఈనెల 15వ తేదీలోగా వెల్లడించాలని కేంద్రాన్ని ముఖ్యమంత్రి కోరినట్టు వార్తాపత్రికల్లో వచ్చిన వార్తలను ఆయన ఖండించారు. సీఎం ఇలా కోరి ఉండరన్నారు. ఎందుకంటే ఆయన సమైక్యవాది అని గుర్తు చేశారు. కేవలం పత్రికలే ఊహాజనితంగా ఆ కథనాలు రాసి ఉంటాయని అభిప్రాయపడ్డారు.
అదేసమయంలో ఈనెల 15వ తేదీ నుంచి ప్రారంభమయ్యే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలను బాయ్కట్ చేసే అంశంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదన్నారు. దీనిపై పార్టీకి చెందిన ఎమ్మెల్యేలతో చర్చించిన తర్వాతే తుది నిర్ణయం తీసుకుంటామన్నారు. తమ ప్రాంతం కంటే.. అసెంబ్లీ సమావేశాలు ముఖ్యం కాదన్నారు. అందువల్ల సమయం వచ్చినపుడు తగిన నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.
తాము పార్టీ అధినేత్రితో పాటు.. ఇతర నేతలను ఢిల్లీలో కలిసినపుడు తమకు అనూకూలంగా సమాధానం చెప్పారన్నారు. అందువల్ల రాష్ట్ర ఏర్పాటు అంశంలో మంచి నిర్ణయం తీసుకుంటారని తాము భావిస్తున్నట్టు చెప్పారు. అలాగే, జస్టీస్ శ్రీకృష్ణ కమిటీ విధి విధానాలు తమకు అనుకూలంగా ఉంటాయనే భావిస్తున్నట్టు చెప్పారు.
అలాలేని పక్షంలో తమ పార్టీకి చెందిన తెలంగాణ ప్రాంత ఎమ్మెల్యేలతో పాటు.. జేఏసీ నేతల సమావేశమై అన్ని అంశాలపై చర్చించి తుది నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. విధి విధానాల అంశంపైనే కేంద్రం, అధిష్టానం కసరత్తు చేస్తోందన్నారు. ఇకపోతే.. తెలంగాణ ప్రజల మనోభావాలకు విరుద్ధంగా నిర్ణయం తీసుకుంటే ఇక్కడి యువకులు నక్సలైట్లుగా మారే ప్రమాదం లేకపోలేదని దామోదర్ రెడ్డి అభిప్రాయపడ్డారు.