ప్రధాన పేజి » వార్తలు » వార్తలు » ఏపీ న్యూస్ » సమైక్యమే మా నినాదం.. ఆ దిశగానే నివేదిక: పీఆర్పీ (PRP | United Andhra | Chiru | CR | Srikrishna | State devide)
రాష్ట్ర ప్రజలంతా సమైక్యంగా ఉండాలని ప్రజారాజ్యం పార్టీ కోరుకుంటుంది. ఆ దిశగానే జస్టీస్ శ్రీకృష్ణ కమిటీకి నివేదిక సమర్పిస్తామని ప్రరాపా సీనియర్ నేత సీ.రామచంద్రయ్య తెలిపారు. దీనిపై ఆయన మంగళవారం హైదరాబాద్లో మాట్లాడుతూ భాషా, పాలనా సౌలభ్యం, భౌగోళిక స్వరూపాల ఆధారంగా విభజన జరగాలని తొలి ఎస్సార్సీ గతంలో చెప్పిందని ఆయన గుర్తు చేశారు.
ఇపుడు ఏ ప్రాతిపదికన రాష్ట్ర విభజన చేపడుతారని ఆయన ప్రశ్నించారు. అసలే తెలంగాణలో నీటి వనరులు తక్కువగా ఉన్నాయని, ఇలాంటి సమయంలో రాష్ట్ర విభజన జరిగితే భవిష్యత్లో పలు సమస్యలు ఉత్పన్నమవుతాయన్నారు. అందువల్ల తమ పార్టీ రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తున్నట్టు ప్రకటించారు. శ్రీకృష్ణ కమిటీకి ఇచ్చే నివేదిక సమైక్యవాదాన్ని మరింత బలపరిచే విధంగా ఉంటుందని రామచంద్రయ్య అభిప్రాయపడ్డారు.
అంతకుముందు ప్రరాపా కార్యాలయంలో జరిగిన ఉగాది వేడుకల్లో పార్టీ అధినేత చిరంజీవి పాల్గొని ప్రసంగించారు. కొత్త సంవత్సరంలో రాష్ట్ర ప్రజలంతా సమైక్యంగా ఉంటూ సుఖ సంతోషాలతో, భోగభాగ్యాలతో జీవించాలని కోరారు.