తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు పేరెత్తితే ముఖ్యమంత్రి రోశయ్య చిర్రుబుర్రులాడుతన్నారు. పనిగట్టుకుని తనను విమర్శించడంపై రోశయ్య గరంగరంగా ఉన్నారు. చంద్రబాబు ఇటీవల తనపై చేసిన వ్యాఖ్యల గురించి మాట్లాడుతూ... బాబు రోజు రోజుకీ దిగజారిపోతున్నాడు. తీవ్రమైన మనోవేదన గురై ఏం మాట్లాడుతున్నాడో తెలియని దుస్థితికి చేరుకున్నాడంటూ దుయ్యబట్టారు.
నీచ రాజకీయాలకు పాల్పడుతున్నది చంద్రబాబా... ? నేనా అనేది ప్రజలకు తెలుసునని అన్నారు. అలనాడు ఔరంగజేబు పదవికోసం తన కుటుంబాన్ని అంతమొందించాడని చెపుతూనే... బాబు వ్యవహారాన్ని చూస్తుంటే అలాగే కనబడుతుందని అన్నారు.
ఏదోవిధంగా ప్రభుత్వాన్ని దెబ్బతీసి తన ప్రతిష్టను పెంచుకునేందుకు తెలుగుదేశం పార్టీ నానా హంగామాలు చేస్తోందని రోశయ్య విమర్శించారు. ఎన్ని చేసినా పనిచేస్తున్న తమ ప్రభుత్వ ప్రతిష్టను దెబ్బతీయలేరని ధీమా వ్యక్తం చేశారు.