ప్రజారాజ్యం పార్టీ అనుబంధ విభాగమైన మహిళా రాజ్యం అధ్యక్షురాలు శోభారాణి పార్టీ అధినేతను టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పించారు. పార్టీలో మహిళలకు తగిన గుర్తింపు లేదని ఆరోపిస్తూ గురువారం బహిరంగ లేఖ రాశారు. పార్టీలో మహిళలను ప్రోత్సహించడం లేదా గుర్తించడంలో పార్టీ అధినేతగా చిరంజీవి పూర్తిగా విఫలమయ్యారని ఆమె ఆరోపించారు.
మహిళలు తమ కుటుంబసభ్యులతో పోరాడి పార్టీలోకి చేరినప్పటికీ.. ఇక్కడ తగిన గుర్తింపునివ్వక పోవడంతో వారు నిరాశానిస్పృహలకు లోనవుతున్నారన్నారు. ముఖ్యంగా పార్టీ అధినేత చిరంజీవి చుట్టూ చేరిన "ఆ నలుగురు" నేతలు పార్టీని భ్రష్టు పట్టిస్తున్నారని ధ్వజమెత్తారు.
అంతేకాక ఒక ప్రతిపక్ష పార్టీగా ప్రజారాజ్యం పూర్తిగా విఫలమైందన్నారు. పార్టీ ప్రధాన ఎజెండా అయిన సామాజిక న్యాయాన్ని విస్మరించడం క్షమార్హమన్నారు. బడుగు వర్గాల అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం పార్టీ ఎలాంటి కార్యక్రమాలు లేదా ఆందోళనలు చేపట్టడం లేదని ఆరోపించారు.