తెలంగాణ ప్రాంతంలో 12 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అభ్యర్థులు గెలుపొందడానికి స్థానిక సమస్యలే ప్రధాన కారణమని కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్, కేంద్ర మంత్రి వీరప్ప మొయిలీ అభిప్రాయం వ్యక్తం చేశారు. ఉప ఎన్నికల ఫలితాలపై ఆయనను ఢిల్లీలో శుక్రవారం మీడియా మాట్లాడుతూ పైవిధంగా స్పందించారు.
తెలంగాణ ఉద్యమం కోసం తమ శాసనసభ సభ్యత్వాలకు రాజీనామా చేసిన అభ్యర్థులనే ఆ ప్రాంత ఓటర్లు గెలిపించారన్నారు. ఇందులో తప్పేమీ లేదన్నారు. ఈ ఫలితాలపై మరింత లోతుగా మాట్లాడేందుకు మొయిలీ నిరాకరించారు. అలాగే, రాష్ట్రంలో ముఖ్యమంత్రి కె.రోశయ్య స్పందిస్తూ.. ఓటర్లు ఇచ్చిన తీర్పును గౌరవిస్తున్నట్టు చెప్పారు.