తెలంగాణ ప్రాంత ప్రజల్లో సెంటిమెంట్ బలంగా ఉండటం వల్లే తెలంగాణ రాష్ట్ర సమితి అభ్యర్థులు ఘన విజయం సాధించారని కేంద్ర సహాయ మంత్రి పురంధేశ్వరి అభిప్రాయపడ్డారు. ఆమె శనివారం విశాఖలో మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ ఉప ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పును ప్రతి ఒక్కరూ ప్రతి రాజకీయ పార్టీ గౌరవించి తీరాలన్నారు.
తెరాస అభ్యర్థుల ఘన విజయానికి అక్కడి ప్రజల్లో ఉన్న సెంటిమెంటే ఏకైక కారణమన్నారు. ప్రత్యేక సెంటిమెంట్ అంతగా లేకుంటే కాంగ్రెస్ కనీసం మూడు నాలుగు స్థానాల్లోనైనా గెలిచి ఉండేదన్నారు. ఏది ఏమైనా.. ఈ ఫలితాలపై కాంగ్రెస్ అధిష్టానం సమీక్ష నిర్వహిస్తుందనే ఆశాభావాన్ని ఆమె వ్యక్తం చేశారు.