రాష్ట్ర విభజనపై నెలకొన్న సమస్యను పరిష్కరించేందుకు తెలంగాణ అంశం సర్వరోగ నివారిణి కాదని లోక్సత్తా అధినేత జయప్రకాష్ నారాయణ అభిప్రాయపడ్డారు. ఆయన శనివారం విశాఖపట్నంలో విలేకరులతో మాట్లాడుతూ తెలంగాణ ఉప ఎన్నికల్లో ఓటర్లను డబ్బు, మద్యం వంటి అంశాలు ఓటర్లను ఏమాత్రం ప్రభావితం చేయలేదన్నారు. అదేసమయంలో ఆ ప్రాంత ప్రజలు ఆగ్రహావేశాలతో ఉన్నారని, అందువల్ల ప్రస్తుతం తెలంగాణ అంశంపై స్పందించడం మంచిది కాదన్నారు.
ఇకపోతే.. శ్రీకాకుళం జిల్లా సోంపేటలో నిర్మించ తలపెట్టిన థర్మల్ విద్యుత్ ప్రాజెక్టుపై ఆయన స్పందిస్తూ రాష్ట్రాభివృద్ధిలో పారిశ్రామికీకరణ అతి ముఖ్యమన్నారు. ఇందుకోసం స్థాపించే ప్రాజెక్టులు ప్రజాభీష్టానికి వ్యతిరేకంగా ఉండరాదన్నారు. రాష్ట్రంలో గ్యాస్ నిక్షేపాలు పుష్కలంగా ఉన్నాయని, ఇలాంటి పరిస్థితుల్లో థర్మల్ విద్యుత్ ప్రాజెక్టులు చేపట్టాల్సిన అవసరం ఏమొచ్చిందని ఆయన ప్రశ్నించారు.
ముఖ్యంగా, ఇక్కడ రైతుల పంట పొలాల్లో థర్మల్ విద్యుత్ ప్రాజెక్టును నిర్మించి, అక్కడ ఉత్పత్తి అయ్యే విద్యుత్ను ఇతర రాష్ట్రాలకు విక్రయిస్తామంటే ఎవరు మాత్రం అంగీకరింస్తారన్నారు. అందువల్ల ఇలాంటి ప్రాజెక్టులకు అనుమతి ఇచ్చే ముందు అన్ని అంశాలపై ప్రభుత్వం కూలంకుషంగా చర్చించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.