డీఎస్ పీఠాన్ని జగన్కి ఇవ్వండి: యువ ఎమ్మెల్యేలు..?
WD
తెలంగాణాలో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయం అనంతరం డీఎస్ రాజీనామాకు ఒత్తిడి పెరుగుతోంది. అదే సమయంలో ఆయన స్థానంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ కుమారుడు, కడప ఎంపీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని కూర్చుండ బెట్టాలని మెజారిటీ యువ ఎమ్మెల్యేలు అభిప్రాయపడుతున్నట్లు సమాచారం. ఈ మేరకు అధిష్ఠానానికి తమ విజ్ఞాపనలను పంపినట్లు భోగట్టా.
మరోవైపు తెలంగాణా ప్రాంతం నుంచి కూడా జగన్ నాయకత్వానికి క్రమంగా మద్దతు పెరుగుతోంది. కొండా సురేఖ, రాజగోపాల్ రెడ్డి, సుధాకర్ రెడ్డి వంటివారు జగన్కు పీసీసీ చీఫ్ పదవిని కట్టబెట్టాలని కోరుతున్నవారిలో ఉన్నారు.
అయితే అంబటి రాంబాబు వంటి నేతలు పుండు మీద కారం చల్లుతున్నట్లు చేస్తున్న వ్యాఖ్యలపై యువ ఎమ్మెల్యేలు అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. ఏదోవిధంగా అధిష్ఠానానికి నచ్చచెప్పి వైఎస్ జగన్ను పీసీసీ చీఫ్ పీఠంపై కూచోబెట్టాలని తాము చూస్తుంటే రాంబాబు వంటివారు సమస్యను మరింత జఠిలం చేస్తూ అధిష్ఠానానికి, జగన్కి మధ్య దూరం పెంచే విధంగా వ్యవహరిస్తున్నారంటున్నారు.
మొత్తమ్మీద ఎలాగైనా జగన్ కు పీసీసీ చీఫ్ పదవిని రాబట్టడమే లక్ష్యంగా పలువురు నాయకులు ఢిల్లీలో పావులు కదుపుతున్నట్లు విశ్వసనీయ సమాచారం. తెలంగాణాలో ఘోర పరాజయాన్ని చవిచూసిన కాంగ్రెస్ హైకమాండ్, జగన్ విషయంలో ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాల్సిందే.