ప్రాంతీయ పార్టీలుగా గుర్తింపు పొందిన తెలుగుదేశం, ప్రజారాజ్యం పార్టీలు పొరుగు రాష్ట్రాల్లో తమ పార్టీ శాఖలను ఏర్పాటు చేసేందుకు సన్నద్ధమవుతున్నాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో రాజకీయ పార్టీగా ఆవిర్భవించిన లోక్సత్తా పొరుగు రాష్ట్రమైన తమిళనాడులో ఏర్పాటు చేయనుంది. ఈవిషయంపై ఆ పార్టీ అధినేత జయప్రకాష్ నారాయణ్ చర్యలు చేపట్టారు.
దీంతో చంద్రబాబు, చిరంజీవిలకు కూడా తమతమ పార్టీల శాఖలను పొరుగు రాష్ట్రాల్లో ఏర్పాటు చేయాలనే ఆలోచన వచ్చింది. ఆ వెంటనే దీనిపై దృష్టి కేంద్రీకరించారు. ఇందులోభాగంగా ప్రజారాజ్యం పార్టీ శాఖను ఒరిస్సా రాష్ట్రంలో ఏర్పాటు చేసేందుకు ఏవైనా అవకాశాలు ఉన్నాయా లేదా అనే అంశంపై ఆరా తీయాల్సిందిగా పార్టీ నేతలను కోరారు.
ప్రధానంగా ఒరిస్సాలో చిరంజీవికి సినిమా హీరోగా మంచి పేరుంది. పైపెచ్చు.. దక్షిణ ఒరిస్సాలోని బరంపూర్ తదితర ప్రాంతాల్లో అనేక మంది తెలుగు ప్రజలు నివశిస్తున్నారు. దీంతో ఆ రాష్ట్రంలో శాఖను ఏర్పాటు చేసి, స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయాలని భావిస్తున్నారు. అలాగే, అండమాన్ అండ్ నికోబార్లలో జరుగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయనున్నారు. ఇందుకోసం పది వార్డుల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితాను కూడా తెదేపా ప్రకటించింది.