ఒకవైపు ప్రకాశం జిల్లాలో వైఎస్ జగన్ ఓదార్పు యాత్ర వాడివేడిగా సాగుతుండగా, ఇంకోవైపు నెల్లూరు జిల్లాలో అప్పుడే ఓదార్పు జ్వరం పట్టుకుంది. అక్కడ ఆనం వర్సెస్ మేకపాటి వర్గాలు వైఎస్ విగ్రహ ప్రతిష్టాపనపై ఒకరిపై ఒకరు మాటల దాడికి పాల్పడుతున్నాయి.
తమ గురువు వైఎస్సార్పై తమకు అభిమానం లేదనీ, ఇంకేవేవో ఆరోపణలు చేస్తున్న పిల్లకాకులకు వైఎస్సార్ కుటుంబం పట్ల తమకున్న అపారమైన అభిమానం ఎటువంటిదో చెప్పాల్సిన పనిలేదని ఆనం వివేకానంద రెడ్డి అన్నారు. ఓదార్పు యాత్ర జగన్ వ్యక్తిగత యాత్ర కనుకనే దానికి దూరంగా ఉంటున్నట్లు చెప్పుకొచ్చారు.
పార్టీ ముందు వ్యక్తులు చాలా చిన్నవారనీ, పార్టీకి వ్యతిరేకంగా తాము ఎట్టి పరిస్థితుల్లోనూ మసలుకునే పరిస్థితే లేదని తేల్చి చెప్పారు. తమను తమ గురువు వైఎస్సార్ అలా నడుచుకోమని చెప్పారనీ, ఆయన చెప్పిన మాటలను తాము తు.చ తప్పకుండా నడుచుకుంటున్నామన్నారు.
ఇక చంద్రబాబు నాయుడు వైఎస్సార్పై చేస్తున్న ఆరోపణలపై స్పందిస్తూ.. బాబుకు వైఎస్ రోజూ కలలోకి వస్తున్నారనీ, ఆ బాధ వదిలించుకునేందుకు ఏదైనా మసీదుకెళ్లి తాయత్తో, లేదంటే ఏ గుడికైనా వెళ్లి యజ్ఞమో చేయడం మంచిదన్నారు. నిద్రలేని రాత్రులు గడపడం బాబు ఆరోగ్యానికి మంచిది కాదని వ్యంగస్త్రాలు సంధించారు.