ప్రజారాజ్యం పార్టీ అధినే చిరంజీవి వర్గానికి చెందిన ప్రజా ప్రతినిధులపై ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి మోజు పెరిగిందని విజయవాడకు చెందిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమా మహేశ్వర రావు ఎద్దేవా చేశారు. దీనిపై ఆయన మాట్లాడుతూ... చిరంజీవి మోజు పడ్డారని చెప్పి ఆయన వర్గానికి చెందిన మంత్రి గంటా శ్రీనివాసరావు కంపెనీ పేరు మీద విజయవాడలోని భవానీ ద్వీపాన్ని కట్టబెట్టే ప్రయత్నాల్లో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నారని ఆరోపించారు.
చిరంజీవి తన పార్టీని కాంగ్రెస్లో విలీనం చేసినందుకు బహుమానంగా ఈ ద్వీపాన్ని ఇస్తున్నారన్నారు. భవానీ ద్వీపంలో 1340 ఎకరాల భూమి ఉంది. టీడీపీ హయాంలో ఇందులో 24 కాటేజీలు, కాన్ఫరెన్సు హాలు, చెట్లపైన కాటేజీలు, బోట్లు వంటి అనేక సౌకర్యాలు కల్పించారు. ప్రస్తుతం ఏడాదికి దీని టర్నోవర్ రూ.రెండు కోట్లుగా ఉందని వివరించారు.
ప్రస్తుతం ఈ ద్వీపం నుంచి భారీ ఆదాయం వస్తున్నందువల్ల దీనిపై చిరంజీవి వర్గానికి చెందిన నేతలు మోజు పడ్డారని ఆయన ఆరోపించారు. అందువల్లే కేవలం రూ.వందల కోట్ల విలువైన ఈ ద్వీపాన్ని కేవలం రూ.60 కోట్లకు ఈ కంపెనీకి కట్టబెడుతున్నారని, ప్రస్తుతం 33 ఏళ్లకు లీజుకు ఇచ్చి తర్వాత దాని ని మరో ఇరవై ఏళ్లకు పొడిగించే అవకాశం కూడా ఆరోపించారు.