వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి సీబీఐ నార్కో టెస్టులు నిర్వహించాలని ప్రయత్నించడం కోర్టు తీర్పులకు వ్యతిరేకమనీ, నార్కో టెస్టులకు వ్యతిరేకంగా తాము దీక్షకు దిగుతున్నామని వైకాపా ఎమ్మెల్యేలు ప్రకటించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరపున కొత్తగా గెలిచిన ఎమ్మెల్యేలంతా అసెంబ్లీలోని గాంధీజీ విగ్రహం వద్ద దీక్షకు దిగారు. ఈ దీక్షను సాయంత్రం 5 గంటల వరకూ కొనసాగించనున్నట్లు తెలిపారు.
వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై అక్రమంగా కేసులు బనాయించి అరెస్టు చేశారనీ, సత్వరమే ఆయనను విడుదల చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు. అంతకుముందు లోటస్ పాండ్ లోని వైకాపా కార్యాలయంలో ఎమ్మెల్యేలంతా భేటీ అయ్యారు.
ఈ భేటీలో వైకాపా శాసనసభా పక్ష నేతగా వైఎస్ విజయలక్ష్మిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అనంతరం అసెంబ్లీకి వచ్చిన నాయకులు దీక్షకు దిగారు.