జులై నాలుగో తేదీ వరకు వైఎస్.జగన్ రిమాండ్ పొడగింపు!
సోమవారం, 25 జూన్ 2012( 12:04 IST )
అక్రమాస్తుల కేసులో అరెస్టు అయి చంచల్ గూడ జైలులో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్.జగన్మోహన్ రెడ్డి రిమాండ్ను జులై నాలుగో తేదీ వరకు నాంపల్లిలోని సీబీఐ ప్రత్యేక కోర్టు పొడగించింది.
ఆయనకు విధించిన రిమాండ్ గడువు ఈనెల 25వ తేదీతో ముగియడంతో జైలులో ఉన్న జగన్ను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సీబీఐ కోర్టు జడ్జి విచారించారు. అనంతరం ఆయన రిమాండ్ గడువును వచ్చే నెల నాలుగో తేదీకి పొడగించారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మరో నిందితుడైన ఐఏఎస్ అధికారి బీపీ ఆచార్యను కూడా కోర్టు విచారించింది.
కాగా, జగన్ అక్రమాస్తులు, ఎమ్మార్ కుంభకోణం కేసులకు సంబంధించి ఒకటి, రెండు, మూడు ఛార్జీషీట్లలో పేర్కొన్న నిందితులందరూ సోమవారం కోర్టుకు హాజరయ్యారు. మరోవైపు.. ప్రముఖ పారిశ్రామికవేత్త నిమ్మగడ్డ ప్రసాద్ దాఖలు చేసుకున్న బెయిల్ పిటీషన్పై విచారణను ఈనెల 28వ తేదీకి వాయిదా వేస్తూనే, కౌంటర్ పిటీషన్ దాఖలు చేయాల్సిందిగా సీబీఐను కోర్టు ఆదేశించింది.