కరీంనగర్ జిల్లా సిరిసిల్లాలో నేతన్నల బతుకులు శిథిలావస్థకు చేరుకుంటున్నాయని, వారిని ఓదార్చాల్సిందిగా తన కుమారుడు జగన్మోహన్ రెడ్డి సూచించారని దీంతో తాను ఇక్కడకు వచ్చినట్టు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్.విజయలక్ష్మి తెలిపారు.
చేనేత కార్మికుల సమస్యల పరిష్కారం కోరుతూ వైఎస్ఆర్ సీపీ ఆధ్వర్యంలో సోమవారం సిరిసిల్లలో జరిగిన ధర్నాలో విజయమ్మ పాల్గొని ప్రసంగించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాను అనుసలిస్తున్న ప్రజా వ్యతిరేక విధానల వల్ల రైతులు, చేనేత కార్మికులు కష్టాల్లో కొట్టుమిట్టాడుతున్నాడన్నారు.
ముఖ్యంగా, దేశానికి అన్నం పెట్టే రైతన్న, కట్టుకునేందుకు బట్టనిచ్చే నేతన్న ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. చేనేత కార్మికుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లేందుకే ఈ దీక్షను చేపట్టినట్టు చెప్పారు.
నేత కార్మికలకు తమ పార్టీ అండగా ఉంటుందన్నారు. దేశంలో రైతన్నలు ప్రథమ స్థానంలో ఉంటే, నేతన్నలు ద్వితీయ స్థానంలో ఉంటారని, అది జగమెరిగిన సత్యమన్నారు. నేడు రైతులు క్రాప్ హాలిడే ప్రకటించే దుస్థితికి చేరుకున్నారన్నారు.
నూలు ధరలు, పాలిస్టర్ దారం ధరలు బాగా పెరిగిపోయాయన్నారు. దీనికి ప్రధాన కారణం పత్తితో పాటు.. దేశీయంగా ఉత్పత్తి అయ్యే నూలును విదేశాలకు ఎగుమతి చేయడమేనన్నారు. ఫలితంగా నేత కార్మికలకు కూలీ కూడా గిట్టని పరిస్థితి ఏర్పడిందన్నారు. సిరిసిల్లలోని నేతన్నలను ఓదార్చమని జగన్మోహన్ రెడ్డి చెబితే తాను ఇక్కడకు వచ్చినట్లు చెప్పారు. త్వరలోనే జగన్ ముఖ్యమంత్రి అయి సువర్ణయుగం తీసుకువస్తారన్న నమ్మకాన్ని ఆమె వ్యక్తం చేశారు. ఆప్పుడు చేనేత కార్మికుల కోసం జగన్ ప్రత్యేక ప్యాకేజీ ప్రకటిస్తారని చెప్పారు.
తన భర్త, మాహానేత వైఎస్ఆర్కు చేనేత వస్త్రాలంటే మహా ఇష్టమన్నారు. ఖద్దరు దుస్తులు ధరించాలన్న గాంధీ ఆశయాన్ని నేటి నేతలు మరిచిపోయారని, రాజశేఖర్ రెడ్డి చేనేత దుస్తులనే ధరించేవారని ఆమె గుర్తు చేశారు. ప్రభుత్వ ఉద్యోగులు అందరూ ఒక రోజు చేనేత దుస్తులు ధరించాలని కూడా జీఓ తీసుకువచ్చారని గుర్తు చేశారు.
ప్రభుత్వం తన ఖజానా నింపుకోవడానికి పన్నులు, విద్యుత్ ఛార్జీలు, ఆర్టీసీ ఛార్జీలు పెంచివేసిందని విమర్శించారు. రాజశేఖర్ రెడ్డి హయాలో ఒక్క పైసా పన్ను కూడా పెంచలేదని గుర్తు చేశారు. ప్రతి పేదవాటి మొఖంలో చిరునవ్వు ఉండాలని ఆయన కోరుకున్నారన్నారు. జగన్ త్వరలోనే బయటకు వస్తారని, ముఖ్యమంత్రి అవుతారని, చేనేత కార్మికుల సమస్యలను పరిష్కరిస్తారని విజయమ్మ విశ్వాసం వ్యక్తం చేశారు.