ఐక్య జాతీయ ప్రగతిశీల కూటమి భారత్-అమెరికా అణు ఒప్పందంపై తన వైఖరిని తేల్చి చెప్పకుండా ఈ ఒప్పందంపై జాతీయ చర్చ జరగాలని ముక్తాయించి సమస్యను అట్టిపెట్టింది. మరోవైపు గత నాలుగేళ్లుగా మతతత్వ శక్తులకు రాజ్యాధికారాన్ని తిరిగి అప్పగించకూడదనే ఏకైక కారణంతో యుపిఎ కూటమికి బయటినుంచి మద్దతు కొనసాగిస్తూ వచ్చిన వామపక్ష కూటమి, అణుఒప్పందం విషయంలో యుపిఎ ప్రభుత్వంతో తెగతెంపులకు దాదాపుగా సిద్ధమైంది.
గురువారం జరగనున్న యుఎన్పిఎ కూటమి సమావేశం తీసుకునే నిర్ణయాలు దేశ రాజకీయాలను మలుపు తిప్పనున్నాయని భావిస్తున్నారు. అణు ఒప్పందం విషయంలో అటో ఇటో తేల్చుకోవాలని కాంగ్రెస్ దృఢవైఖరి అవలంబించి శరవేగంగా పావులు కదపడంతో రాజకీయ సమీకరణలు ఒక్కసారిగా వేగం పుంజుకున్నాయి.
వామపక్షాల తోడ్పాటు లేనిదే యుపిఎ ప్రభుత్వ మనుగడ లేదన్న పరిస్థితినుంచి కాంగ్రెస్ ఒక్కసారిగా దూకుడు వైఖరిని అవలంబించి మద్దతిస్తే ఇవ్వండి, లేకపోతే పోండి అనే రీతిన వ్యవహరించడానికి ఒకే ఒక్క పార్టీ కారణమైంది. అది సమాజ్వాదీ పార్టీయే మరి.
ఆశ్చర్యమేమిటంటే దేశ సార్వభౌమత్వానికి సంబంధించిన ఇంత కీలక విషయంలో కూడా జాతీయ ఏకాభిప్రాయం భావనకు అన్ని పార్టీలూ నీళ్లొదిలి, కేవలం తమ సంకుచిత రాజకీయ వైఖరులనే ప్రదర్శిస్తూండడం తీవ్ర విచారాన్ని కలిగిస్తోంది. అణు విధానంపై దేశ స్వతంత్ర ప్రతిపత్తి సమస్య పక్కకు పోయి ఎవరి గొడవ వారిదే రీతిలో జాతీయ రాజకీయ పార్టీలు వ్యవహరిస్తున్నాయి.
ఇక ములాయం సింగ్ ఆద్వర్యంలోని సమాజ్వాది పార్టీది మరో విచిత్రమైన స్థితి. బలమైన ప్రత్యర్థి మాయావతిని ఎదుర్కోని ఉత్తరప్రదేశ్లో మనగలగాలంటే అటు కాంగ్రెస్ ఇటు బిజెపి.... ఏదో ఒక బలమైన పార్టీని ఎంచుకోవలసి వచ్చినప్పుడు ఈ రెండింటిలో రాష్ట్రంలో బలహీనంగా ఉన్న కాంగ్రెస్ వైపు మొగ్గు చూపటంలో ఎస్పీ అవలంబిస్తున్న చాణక్య నీతి అబ్బురపరుస్తోంది.
ఉత్తరప్రదేశ్ని కాంగ్రెస్ త్యాగం చేసి తనకిచ్చేస్తే అణుఒప్పందంతో సహా ఎలాంటి బేరసారాల్లో అయినా సరే కాంగ్రెస్కు వత్తాసు పలుకుతాననే దీర్ఘ కాలిక దృక్పధంతో సమాజ్వాది పార్టీ గత కొద్ది రోజులుగా పావులు కదుపుతోంది. ఈ క్రమంలో యుఎన్పిఎ బీటలు వారి కుప్పకూలినా ఎస్పీకి పట్టదు.
|