రాకెట్లు తయారు చేసేవారు సైకిల్పై ప్రయాణం చేస్తారంటే నమ్ముతామా....! ఆశ్చర్యంగా ఉంది కదూ..! మీరు నమ్మినా నమ్మకపోయినా ఇది నిజం.. ఆయన రాకెట్ డిజైన్లు చేయడంలో ఆయన దిట్ట. ఆయన తయారు చేసిన రాకెట్లు భూ వాతావరణాన్ని చీల్చుకుని వాయువేగంతో అంతరిక్షం వైపుకు దూసుకెళ్ళతాయి. కానీ ఆయన మాత్రం కార్యాలయానికి సాదాసీదాగా సైకిల్పై వస్తాడు.
పెట్రోల్ భారం భరించలేక అలా వస్తుంటాడని తేలిగ్గా కొట్టి పారేయకండి. వారం కాదు... నెల కాదు.... ఏకంగా రెండు దశాబ్దాల నుంచి ఆయన కార్యాలయానికి వచ్చేది సైకిల్ పైనే... ఇప్పుడు ఆయన ఎవరో తెలుసుకోవాలని ఉంది కదూ... ఆయన పేరు డాక్టర్ వి. ఆదిమూర్తి... హోదా ఏమిటో తెలుసా...! తిరవునంతపురంలోని విక్రమ్ సారాభాయి అంతరిక్ష కేంద్రంలో సహ సంచాలకులుగా పని చేస్తారు.
కావాలనుకుంటే యేడాదికొక కారును మార్చ గల ఆర్థిక స్థితి ఆయనకుంది. అయినా సరే ఆయన తన ప్రయాణానికి సైకిల్నే ఎన్నుకున్నారు. ఇది జరిగి ఇప్పటికి దాదాపుగా 20 యేళ్ళు పూర్తయ్యింది. ఆధునిక ప్రపంచ ఆరంభం కాకమునుపు అందరూ సైకిళ్ళనే వాడేవారు. సాంకేతికత కొత్త పుంతలు తొక్కుతోంది. మార్కెట్లోకి రోజుకో మోటారు వాహనాలలో కొత్త మోడల్ వస్తోంది. వాటి కోసం జనం వెంపర్లాడుతున్నారు.
అయినా సరే తనకు సైకిలే అనుకూలమని ఆదిమూర్తి అంటున్నారు. రోజుకు కనీసం 20 కి.మీ. సైకిల్ మీదే ప్రయాణిస్తాడు. ప్రముఖ మళాయ కవి, విద్యావేత్త అయిన విష్ణు నారాయణన్ నంబూద్రి కూడా సైకిల్నే వినియోగిస్తారు. తిరువునంతపురంలోని రోడ్లపై ఉన్న మిట్టపల్లాలు తమను ఏమి చేయలేవనే అంటున్నారు. పైగా చాలా ఉపయోగాలున్నాయని చెపుతున్నారు. శారీరకంగా, మానసికంగా ఇందులో ఎంతో ప్రశాంతత లభిస్తుందని వారు చెపుతున్నారు.
సైకిల్ వినియోగం వలన అన్నింటికి మించి వాతావరణాన్ని కాలుష్య కోరల్లోంచి బయట పడవేసిన వారమవుతారు. ఇంధన ఖర్చు మిగలడం ఒక అంశమైతే, ప్రస్తుత పరిస్థితులలో ఇంధన పొదుపు అన్నిటికి మించిందవుతుందనేది వారి అభి ప్రాయం. ఇవన్నీ సమాజానికి మేలు చేసే అంశాలే. తాను రూపొందించిన రాకెట్ విజయవంతంగా నింగికెగసినపుడు ఎంత వియధరహాసంతో ఉంటారో, సైకిల్ ప్రయాణం అంత అనుకూలంగా ఉంటుందంటారు ఆదిమూర్తి... ఆయన నవ సమాజానికి ఆదర్శ మూర్తి.
|