ఒకప్పుడు అరుణ గ్రహం.. సరస్సులు, నదులు, జీవానికి దన్నుగా ఉండే నీటి అవశేషాలతో కప్పబడి ఉండేదని అంగారక గ్రహం మీది నేలలోని ఖనిజాలు చూపిస్తున్నాయని అమెరికా పరిశోధకులు తెలిపారు.
గత నెలలో అంగారక గ్రహంమీద దిగిన ఫీనిక్స్ లాండర్ ఆ గ్రహం ఉపరితలంపై మంచును కనుగొన్నివిషయం తెలిసిందే. అయితే అది శిలారూపంలో ఎర్ర ధూళితో కప్పబడిపోయింది. అయితే ఒకప్పుడు ఈ గ్రహంపై నీటి జాడ ఉండేవనడానికి ఈ ఘనరూపంలోని మంచు తిరుగు లేని సాక్ష్యంగా నిలుస్తోందని పరిశోధకుల వ్యాఖ్య.
ఈ ఆవిష్కరణ నిజంగా అధ్బుతమైనదని రోడ్ ఐలండ్లోని బ్రౌన్ యూనివర్శిటీకి చెందిన జాన్ మస్టర్డ్ తెలిపారు. అంగారక గ్రహంపై తాము భవిష్యత్ రోదసీ యాత్రికులు దిగడానికి అనువైన పలు స్థలాలను కనుగొంటున్నామని, ఈ గ్రహం మనుషులు జీవించడానికి అనువైనదో లేదో, గతంలో ఇక్కడ జీవం ఆనవాళ్లు ఉన్నాయో లేదో తెలుసుకునేందుకు భవిష్యత్తు అంగారక యాత్రలు ప్రయత్నిస్తాయని జాన్ చెప్పారు.
అంగారక గ్రహం మీది పురాతన ఉపరితలంలో దాగి ఉన్న ఖనిజాలు ఈ గ్రహం మీద అనేక తడి ప్రాంతాలను చూపిస్తున్నాయని జాన్ తెలిపారు. అంగారకుడి మట్టిలోని ఖనిజాలు తక్కువ ఉష్ణోగ్రతల్లో ఏర్పడ్డాయని పరిశోధకులు తెలిపారు. ఈ గ్రహంపై ఒకప్పుడు జీవించేందుకు అనువైన పరిస్థితులు ఉన్నాయని దీనర్థం. చాలా కాలంపాటు ఇక్కడ పుష్కలంగా నీటి వనరులు ఉండేవని దీనిబట్టి తెలుస్తోందని జాన్ వ్యాఖ్యానించారు.
ఈ కొత్త ఆవిష్కరణలతో అంగారక గ్రహంపై ఎంత కాలంపాటు నీరు ఉండేది, అక్కడ ఎన్ని తడి వాతావరణాలు ఉండేవి అనే అంశాలు పరిశోధించాల్సి ఉందని స్కాట్ ముర్చీ చెప్పారు. అరుణ గ్రహంమీది మట్టి రేణువులు ఈ గ్రహంమీది రాతిపొరల్లో 4.6 బిలియన్ల నుంచి 3.8 బిలియన్ల మధ్య కాలంలో నీటి జాడలు ఉండేవని సూచిస్తున్నాయి.
ఈ గ్రహంపై తడి వాతావరణ చాలా కాలం కొనసాగిందని ఓ అధ్యయనం చెబుతోంది. నదుల పిల్లకాలువలు అక్కడ ఓ డెల్టా రూపంలో అవతరించి ఉంటాయని దీన్ని బట్టి శాస్త్రజ్ఞులు ఊహిస్తున్నారు.
మొత్తంమీద జీవం ఆనవాళ్లను పొడసూపుతున్న అరుణ గ్రహం మానవ అన్వేషణలను మరిం పదును పెట్టబోతోంది.
|