అహింస అనే ఆయుధంతో తెల్లదొరల బానిస సంకెళ్ళ నుంచి కోట్లాది మంది భారతీయులను విముక్తులను చేసిన మానవదైవం జాతిపిత మహాత్మాగాంధీ. ఆయన ఎందరికో మార్గదర్శకం. ఒక్క భారతీయులకే కాకుండా ప్రపంచంలోని ఎందరో ప్రజలకు ఆయనంటే ప్రాణం. అయితే ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన నోబెల్ శాంతి పురస్కారం మాత్రం ఆయన్ను వరించలేదు.
దీనిపై భిన్నకథనాలు వచ్చాయి. 1948లో గాంధీకి నోబెల్ ఇవ్వాలని అవార్డు కమిటీ నిర్ణయించింది. కానీ అదే ఏడాది ఆయన హత్యకు గురైనందువల్లే బహుమతి ఇవ్వలేక పోయామని ప్రకటించింది. ఈ విషయాన్ని నోబెల్ కమిటీ చీఫ్ ఓల్ డాన్బోల్ట్ వెల్లడించారు.
ఇదే విషయంపై ఇటీవల బంగ్లాదేశ్కు చెందిన డెయిలీస్టార్ అనే పత్రికతో ఆయన మ్లాటాడుతూ నోబెల్ శాంతి పురస్కారాల షార్ట్ లిస్ట్లో గాంధీజీ పేరు మొత్తం ఐదుసార్లు ఎంపికైంది. మొదటి నాలుగు సార్లు సంపూర్ణ మెజారిటీ దక్కలేదు. కానీ, 1947 చివర్లో పురస్కార కమిటీ గాంధీ పేరును ఏకగ్రీవంగా ఎంపిక చేసింది. 1948లో హత్య జరుగడంతో కమిటీ తీవ్ర ఆందోళనకు గురైంది. దీంతో ఆ యేడాది అవార్డును ఎవరికీ ప్రకటించలేదని వివరించారు.
అయితే గాంధీజీ మరణానంతరం ఇవ్వాలని పలు సూచనలు, సలహాలు వచ్చాయి. ఇందుకు ఉదారహణగా డాగ్ హామర్సోల్డ్ పేరును ప్రస్తావించారు. ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శిగా పని చేసిన ఈయనకు మరణాంతరం నోబెల్ పురస్కారం వరించింది. అయితే ఈ సంప్రదాయాన్ని తిరిగి పునరావృత్తం చేయదలచుకోలేదని, అందువల్లే మరణానంతరం గాంధీజీకి అవార్డును ఇవ్వలేక పోయామని చెప్పారు.
|