ఆసియా నోబెల్ పురస్కారంగా పరిగణించే రామన్ మెగాసెసే అవార్డు-2008ను ప్రముఖ సామాజికవేత్త బాబా ఆమ్టే కుమారుడు ప్రకాష్ ఆమ్టే, కోడలు మందాకిని ఆమ్టేలను వరిచింది. కమ్యూనిటీ లీడర్షిఫ్ విభాగంలో వీరిద్దరికి ఈ ఏడాది ఆవార్డును అందజేయనున్నట్టు అవార్డుల కమిటీ ప్రకటించింది. ఆసియా నోబెల్ పురస్కారంగా పరిగణించే ఈ అవార్డును గతంలో బాబా ఆమ్టేకు దక్కింది.
ఒకే కుటుంబంలోని తండ్రీ కుమారులకు ఈ అవార్డు దక్కడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. మహారాష్ట్రలోని గడ్చిరోలీ జిల్లా కుగ్రామమైన హేమల్ కాసాలో వుంటూ.. అక్కడి గిరిజనుల జీవితాల మెరుగు, సంక్షేమం కోసం చేస్తున్న నిరంతర కృషికి గుర్తింపుగా ఈ అవార్డు దక్కింది. ‘కమ్యూనిటీ లీడర్షిప్’ కేటగిరీలో వారికి అవార్డును ఇవ్వనున్నట్లు ఫిలిప్పైన్స్కు చెందిన మెగసెసే ఫౌండేషన్ గురువారమిక్కడ ప్రకటించింది.
ప్రకాశ్ ఆమ్టే దంపతులను ఎంపిక చేయడంతో ఈ అవార్డును పొందిన తొలి భారతీయ తండ్రీకుమారులుగా బాబా, ప్రకాశ్లు చరిత్ర సృష్టించారు. సామాజిక సేవకు గాను 1985లో బాబా ఆమ్టేను ఈ పురస్కారానికి ఎంపిక చేశారు. మహారాష్ట్రలో అత్యంత వెనుకబడిన గిరిజన ప్రాంతంలో నెలకొల్పిన ఆనంద్వన్ ఆశ్రమం ద్వారా కుష్ఠు వ్యాధిగ్రస్తుల జీవితాల్లో వెలుగులు నింపేందుకు బాబా తుదికంటా శ్రమిస్తూ వచ్చారు.
గత ఏడాది ఫిబ్రవరి నెలలో బాబా ఆమ్టే కన్నుమూశారు. ఆయన అడుగు జాడల్లో నడుస్తూ వచ్చిన ఆయన కుమారుడు ప్రకాష్.. వైద్య వృత్తిలో కొనసాగుతున్నారు. ఈ నేపథ్యంలో హేమల్ కాసాలో నెలకొల్పిన 40 పడకల ఆసుపత్రి ద్వారా ఏడాదికి 40 వేల మందికిపైగా గిరిజనులకు వైద్య సేవలు అందిస్తున్నారు.
అంతేకాకుండా అక్కడే ఒక పాఠశాలను సైతం నెలకొల్పి, గిరిజనుల పిల్లలకు విద్య చెపుతున్నారు. ఈ పాఠశాలలో విద్యాభ్యాసం పూర్తి చేసిన ఐదుగురు గోండు తెగ గిరిజన విద్యార్థులు ఉన్నత వైద్య కోర్సును పూర్తి చేసి హేమల్ కాసా ఆస్పత్రిలో వైద్య సేవలు అందిస్తుండటం గమనార్హం.
|