ఆయనో సైనిక దిగ్గజం.... ప్రపంచ దేశాలన్నీ ఇది తప్పు అంటున్నా ఏ మాత్రం లెక్కచేయలేదు. సైనికాధిపతిగా ఉన్న ఆయన చట్టసభలను చుట్టచుట్టి అటకపై పెట్టారు. దేశానికి అన్ని తానేనని తేల్చి చెప్పారు. పాకిస్థాన్ అధ్యక్షుడి హోదాలో అధికారాన్ని హస్తగతం చేసుకున్నారు. రాజకీయ పక్షాల నాయకులు దేశం విడిచి పరుగులు పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ఇది జరిగి దాదాపు 9 యేళ్ళు కావస్తోంది. అప్పటి నుంచి ఆ దేశానికి ఆయనే రాజు ఆయనే మంత్రి. ఇంత చెప్పిన తరువాత కూడా ఆ దేశమేది... ఆ నాయకుడెవరని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆ దేశం పాకిస్థాన్ అని... ఆ మొండి ఘటం పేరు పర్వేజ్ ముషార్రఫ్ అనే విషయం ఇట్టే తెలిసిపోతుంది. ఆయన తన అధ్యక్ష పర్వాన్ని సోమవారంతో ముగించారు.
1943 ఆగస్టు 11న ప్రస్తుతం భారత రాజధాని అయిన ఢిల్లీలో జన్నించారు. ఈయన ఢిల్లీ విశ్వివిద్యాలయం నుంచి మీడియాకు సంబంధించిన పట్టా అందుకున్నారు. భారత్నుంచి పాక్ విడిపోయిన తరువాత ఆయన కుటుంబం పాకిస్థాన్కు వలస పోయింది. 1961లో సైన్యంలో అడుగుపెట్టిన ముషార్రఫ్ మొదటి నుంచి ధైర్య సాహసాలు ఉన్న వ్యక్తేనని చెప్పాలి. భారత్తో జరిగిన యుద్ధ సమయంలో తెగువ చూపిన ఆయనకు పదోన్నతులు సులువయ్యాయి.
చెప్పాపెట్టకుండా వెళ్ళిపోయినందుకు ఆయన సైనిక చర్యకు గురయ్యారు. తరువాత తిరిగి భారత్తో యుద్ధ వాతావరణం ఎదురుకావడంతో ఆయన తిరిగి సైన్యంలోకి చేరారు. అప్పటి నుంచి ఆయనకు రాజకీయ నాయకులతో సంబంధాలు మొదలయ్యాయి. 1998లో సైనిక సర్వోన్నతాధికారి పదవిని అధిష్టించారు. 1999లో ఆయన అధికార పీఠాన్ని చేపట్టారు. భారత్ ఎప్పుడు కాలు దువ్వే ముషార్రఫ్కు పాకిస్థాన్లో మంచి ఆదరణ లభించింది.
|