గత నెల 26న ఆర్థిక రాజధానిగా పేరొందిన ముంబైలో ఉగ్రవాదుల దాడులకు దెబ్బతిన్న చారిత్రాత్మక తాజ్ హోటల్ ఈ నెల 21 నుంచి తిరిగి అతిథులకు ఆతిథ్యమివ్వడానికి పున: ప్రారంభమైంది. ఉగ్రవాదానికి, ఉగ్రవాదుల చర్యలకు ముంబై వాసులు బెదిరిపోరనడానికి సాక్ష్యంగా దుర్ఘటన జరిగిన 25 రోజుల్లోనే తిరిగి పున: ప్రారంభంకావడం విశేషం. ఉగ్రవాదుల దుశ్చర్యలు.. భారతదేశంపై అంతర్గత తీవ్రవాదంనుంచి అంతర్జాతీయ ఉగ్రవాదం దాకా, తాజా మారణ హోమం ముంబైలోని తాజ్ హోటల్పై దాడులు ఒక మహా సంగ్రామాన్నే తలపించాయి. 1962లో చైనా దాడి, 1965లో పాక్ యుద్ధం, 1971లో బంగ్లాయుద్ధం ఆ తర్వాత కార్గిల్ యుద్ధకాండ, వీటినిమించి దారుణమైన సంఘటన గత నెల 26న ముంబైలో జరిగిన మారణహోమం. భారత దేశపు ఆర్థిక రాజధాని అయిన ముంబై మహానగరం గడ్డపై రెండురోజులకుపైగా రాత్రింబవళ్లు మహాసంగ్రామమే జరిగింది. ఉగ్రవాదులు అరేబియా సముద్రాన్ని రాజమార్గంగా ఎంచుకుని యుద్దతంత్రంతో ప్రవేశించగలగడమే దేశ భద్రతా దౌర్భాగ్యానికి పరాకాష్ట. దీనివెనుక అంతర్జాతీయ కుట్ర దాగుందనడానికి మన దేశం వద్ద సాక్ష్యాధారాలు ఉన్నాయి. నిరుడు మార్చినెలలోనే తెరవెనుక ఎన్నో ప్రణాళికలు రూపొందాయి. దుండుగులు భారతదేశంలోకి సముద్ర మార్గంద్వారా ఆయుధాలతో సహా రావడమెలాగో తెలుసుకున్నారు. వారు రక్షణ పరంగా ముంబైలోని బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్కి దగ్గరలో ఓ సురక్షితమైన ఇంట్లో తలదాచుకోవడం విశేషం. అలా రావడం ఎంత సులభమో, ఎంత సురక్షితమో కూడా వారు ధృవీకరించుకున్నారు. కరాచీ నుంచి ముంబైకి పడవల్లో ఆత్మాహుతి దళాలను పంపి లష్కరే తోయిబా కమాండెంట్లు మారణకాండకు రంగం సిద్ధంచేసుకున్నారు. |