దేశంలో పులుల సామ్రాజ్యం క్రమేణా అంతరించి పోతోంది. గత ఆరేళ్ళ కాలంలో దాదాపు 110 పులులు కనుమరుగు అయ్యాయని ప్రభుత్వ లెక్కలు చెపుతున్నాయి. వేటగాళ్ల వల్ల, ఇతర కారణాల రీత్యా ఆరేళ్ల కాలంలో దేశంలోని పెద్దపులుల్లో 110 వరకూ చనిపోయాయని ప్రభుత్వం తాజాగా నిర్వహించిన ఒక సర్వేలో వెల్లడించింది. ఈ ఏడాదిలో నవంబర్ వరకూ 14 పులులు మరణించినట్టు తేలింది. ఆర్టీఐ చట్టం కింద ఈ సమాచారం వెల్లడైంది. సాధారణ అడవులతో పాటు అభయారణ్యాలలోనూ వీటి మనుగడ ప్రశ్నార్ధకంగా మారిందని ఈ లెక్కలు చెపుతున్నాయి. కిందటి నెలలో నమోదైన వేటగాళ్ల కేసుల్లో ఆరింటిలో మూడు పులులు మరణించగా, వీటిలో మధ్యప్రదేశ్లోని కన్హా, ఖతీయా అభయారణ్యాల్లో ఒక్కొక్కటి చొప్పున, ఉత్తరప్రదేశ్లోని ధుడ్వా పులుల అభయారణ్యంలో మరొకటి మృత్యువాత పడ్డాయి. గత 2002 నుంచి గమనిస్తే, కేవలం 2007లోనే 30కి పైగా పులుల చనిపోయాయని ఈ లెక్కలు వెల్లడించాయి. కాగా, గత ఆరేళ్ళ కాలంలో ఇంత పెద్ద సంఖ్యలో పులులు మరణించడం దేశ చరిత్రలోనే తొలిసారి. వీటిలో యూపీలోని విశ్వవిఖ్యాత కోర్బెట్ అభయారణ్యంలో ఐదు, ఎంపీలోని బందీపూర్ పార్క్లో రెండు చనిపోయాయి. ఇతర అడవుల్లో మరణించిన 14 పులుల్లో ఐదు వేటగాళ్ల దెబ్బకు, మరో మూడు విషప్రయోగం వల్ల ప్రాణాలు కోల్పోయాయి. నరమాంసం రుచి మరిగి, జనావాసంలోకి వచ్చిన ఒక పులిని అటవీ సిబ్బంది కాల్చి చంపారు. ఈ సంఘటన మహారాష్ట్ర నాగపూర్ ప్రాంతంలోని చందారపూర్లో గత ఏడాది ఆఖరులో జరిగింది. ఈ సమాచారమంతా అధికారమైనప్పటికీ.. వాస్తవానికి చనిపోతున్న పులుల సంఖ్య ఎక్కువ సంఖ్యలోనే ఉందని విఖ్యాత వన్యప్రాణుల నిపుణుడు డెలిండా రైట్ అభిప్రాయపడుతున్నారు. |