ఎక్కడ చూసినా ఉద్యోగాల కోత... ఆర్థిక సమస్యలు... చుట్టు ముడుతున్న మాంద్యం... ఎప్పుడేమవుతుందో తెలీని జీవన గమ్యం... ఇవన్నీ మనస్సులపై ప్రభావం వేస్తూ అలజడి సృష్టిస్తుండటం జ్యోతిష్కులకు వరంగా మారింది. గత సంవత్సర కాలంగా సంక్షోభం ముట్టడిలో చిక్కిపోయిన ప్రజలు కొత్త సంవత్సరమైనా తమ భాగ్యరేఖలు మారతాయో, లేదో తెలుసుకునేందుకు జ్యోతిష్కుల వెంట పరుగు పెడుతున్నారు. ఆర్థిక సంక్షోభం అన్ని రకాల వృత్తులను దెబ్బతీసి ఉంటే ఉండవచ్చు గాని ప్రస్తుతం జ్యోతిష్యం మాత్రం వృత్తిగా ఉన్నతస్థాయిలో ఉంది. ఈ ఏడాది పొడవునా అర్థిక అభద్రతతో గడిపిన వారు రేపటి పరిస్థితి ఎలా ఉంటుందో తెలుసుకోవాలనే కుతూహలంలో జ్యోతిష్కులను సంప్రదించడం ఎక్కువైంది.గత కొద్ది రోజులుగా తమ సేవలకోసం వచ్చే వినియోగదారుల సంఖ్య పెరిగిందని అస్ట్రోయోగి వెబ్సైట్ ఓనర్ మీనా కపూర్ తెలిపారు. సంక్షోభం, మీడియా కవరేజి కారణంగా చాలామంది భవిష్యత్ అంచనాలు తెలుసుకోవడానికి తమను సంప్రదిస్తున్నారని ఆమె తెలిపారు. కాగా, 2009లో వెనుకబడిన వర్గాల ప్రజలకు మేలు జరిగే అవకాశముందని సుప్రసిద్ధ జ్యోతిష్కుడు బేజన్ దరువారా చెబుతున్నారు. వచ్చే యేడు ఏప్రిల్ ప్రారంభంలో బుధుడు మీనరాశిలో ప్రవేశిస్తున్నందువల్ల సాధారణ ప్రజలకు మంచి జరుగుతుందని చెప్పారు. లక్ష్మి, పురోగతి, సౌభాగ్యం వంటి వాటికి ప్రాతినిధ్యం వహించే బుధుడు మీనరాశిలో ప్రవేశిస్తున్నప్పుడు ఆర్థిక ప్రగతి తప్పనిసరిగా ఉంటుందని, జాతికి భద్రతా ప్రమాదాలు కూడా పెద్దగా ఉండవని బేజన్ చెబుతున్నారు.భద్రతకు సంకేతమైన శని, ఆకస్మిక విపత్తులకు సంకేతమైన యురేనస్ గత సంవత్సరంలో సరైన పొందికలో లేనందువల్ల ఏడాది పొడవునా పరిస్థితులు అతలాకుతలం అయ్యాయని 78 ఏళ్ల వృద్ధ జ్యోతిష శాస్త్రజ్ఞుడు బేజన్ చెప్పారు. ముంబై దాడులతో సహా పెరిగిన ఉగ్రవాద దాడులు, స్టాక్ మార్కెట్లలో పెట్టుబడులు కుప్పగూలడం వంటి కారణాలతో పలువురు తమ అభిష్యత్ అంచనాలకోసం హస్తసాముద్రికులను, జ్యోతిష్కులను, టారోట్ కార్డ్ రీడర్లను సంప్రదించడం ఎక్కువైపోయింది. |