ప్రధాన ప్రతిపక్షం భారతీయ జనతా పార్టీలో అంతర్గత సంక్షోభం ముదిరి పాకాన పడింది. కమలనాథుల్లో అంతర్గత కుమ్ములాటలు బయటపడ్డాయి. నిన్న మొన్నటి వరకు నివురు గప్పిన నిప్పులా ఉన్న అసమ్మతి ఒక్కసారిగా బయటపడింది. పలువురు నేతలు అధినాయకత్వంపై తిరుగుబాటు బావుటా ఎగురవేశారు. పార్టీ అగ్రనేతల్లో ఆధిపత్య పోరు తారా స్థాయికి చేరుకుంది. ఫలితంగా.. మొన్న పార్టీ సీనియర్ నేత, మాజీ సైనికాధికారి జశ్వంత్ సింగ్ తమ అక్కసును వెళ్లగక్కుతూ అధిష్టానాన్ని లేఖ సంధించారు. నిన్న మరో సీనియర్ నేత, ఐఏఎస్ మాజీ అధికారి యశ్వంత్ సిన్హా పార్టీకి రాజీనామా చేశారు. ఈ రెండు సంఘటనల నుంచి కమలనాథులు తేరుకోక ముందే.. మంగళవారం మరో కీలక నేత అరుణ్ జైట్లీ పార్టీ పదవికి గుడ్బై చెప్పారు. ఒక వ్యక్తికి ఒకే పదవి అన్న పార్టీ సిద్ధాంతాన్ని ఉటంకిస్తూ పార్టీ ప్రధాన కార్యదర్శి పదవి నుంచి తప్పుకున్నారు. దీంతో కమలం పార్టీ అంతర్గత విభేదాల సుడిగుండంలో కూరుకుంది. ఇదిలావుండగా.. యశ్వంత్ సిన్హా మాత్రం పార్టీ అధిష్టానంపై తీవ్రస్థాయిలోనే విమర్శలు చేశారు. ఈ మేరకు పార్టీ అధ్యక్షుడు రాజ్నాథ్ సింగ్కు ఘాటైన లేఖను కూడా సంధించారు. ముగిసిన సార్వత్రిక ఎన్నికల్లో ఓటమికి బాధ్యులైన వారే పార్లమెంటరీ పార్టీలో పదవులను కైవసం చేసుకోవడాన్ని యశ్వంత్ సిన్హా సూటిగా ప్రశ్నించారు. ఓటమిపై పార్టీ అధిష్టానం ఆత్మ విమర్శ చేసుకునేందుకు సాహసం చేయలేదని ఆయన ఘాటుగా విమర్శించారు. ఈ లేఖతో రాజ్నాథ్ ఖంగుతిన్నారు. పార్టీ విజయం కోసం అహర్నిశలు పాటుపడిన తనలాంటి వారి గోడు వినేందుకు పార్టీలో ఒక్క నేత కూడా లేరంటూ తన అక్కసును వెళ్లగక్కారు. ఎన్నికల ప్రచారానికి నాయకత్వం వహించిన నేతలు ఓటమికి నైతికి బాధ్యత వహించాల్సింది పోయి.. తమకు తాము క్లీన్ చిట్ ఇచ్చుకోవడం సిన్హాకు ఏమాత్రం మింగుడు పడటం లేదు. |