రాష్ట్రంలో ఇద్దరు ఉన్నతాధికారుల మధ్య కోల్డ్వార్ సాగుతోంది. వారిలో ఒకరు రాష్ట్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ ఐ.వి.సుబ్బారావు. మరొకరు పోలీసు బాస్ ఎస్పీ వై.యాదవ్. వీరిద్దరి గుణగణాలు వేరు. విధులు అంతకంటే వేరు. అయితే, వీరిద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. కారణం.. తనను అకారణంగా ఎన్నికల విధుల నుంచి తప్పించారనే అక్కసు ఒకరిదైతే. మరొకరిది.. నిష్పక్షపాతంగా ఎన్నికల విధులు నిర్వహించడం. ఈ రెండు విషయాలే వారిద్దరి మధ్య ప్రచ్ఛన్న యుద్ధానికి దారితీసింది. ఈ యుద్ధానికి కారణాలు ఏమిటినే అంశంపై ఆరా తీద్దాం. 15 వ లోక్సభతో పాటు.. రాష్ట్ర 13వ అసెంబ్లీకి ఎన్నికలు నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం ఏక కాలంలో నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ ప్రకటనకు ముందుగానే కర్నూలులో జరిగిన ఒక కార్యక్రమలో యాదవ్ పాల్గొని వైఎస్ ప్రభుత్వంపై ప్రశంసల వర్షం కురిపించారు. దీనిపై ప్రతిపక్షాలు తీవ్రంగా మండిపడ్డాయి. ఎన్నికల వేళ పోలీసు బాస్ ఇలా వ్యాఖ్యానించడాన్ని తీవ్రంగా తప్పుపట్టాయి. ఆయన్ను ఎన్నికల విధుల నుంచి తప్పించాలని కోరాయి. ఇంతలో యాదవ్ చెప్పాపెట్టకుండా సింగపూర్కు వెళ్ళిపోయారు. దీంతో సీఈసీ మరింత ఆగ్రహం వ్యక్తం చేస్తూ, ఆయన స్థానంలో మహంతిని డీజీపీగా నియమించింది. ఆ తర్వాత ఎన్నికలు పూర్తికావడం, ఫలితాలు వెలువడటం, కాంగ్రెస్ తిరిగి అధికారంలోకి రావడం, యాదవ్ డీజీపీగా తిరిగి బాధ్యతలు స్వీకరించడం అన్నీ చకచకా జరిగిపోయాయి. ఇక్కడ నుంచే యాదవ్ ప్రభుత్వం అండతో కక్ష సాధింపు చర్యలకు శ్రీకారం చుట్టారని వినికిడి. సార్వత్రిక ఎన్నికలను నిష్పక్షిపాతంగా, శాంతియుతంగా నిర్వహించి పార్టీలకు అతీతంగా ప్రజల నుంచి మన్ననలు అందుకున్న సీఈసీ సుబ్బారావును ఆయన టార్గెట్ చేసుకున్నారని పలువురు అంటున్నారు. దీన్ని బలపరిచే విధంగా... తనను ఎన్నికల విధుల నుంచి ఎందుకు తప్పించారో వివరణ ఇవ్వాలంటూ యాదవ్ ఈసీకి నోటీసు జారీ చేశారు. దీనికి సుబ్బారావు స్వయంగా వివరణ ఇచ్చారు. అయితే, ఈ వివరణపై సంతృప్తి చెందని యాదవ్, ప్రభుత్వం అండతో ఆయనపై లేనిపోని విమర్శలు ఎక్కుబెట్టి, ప్రశ్నలు సంధించారు. అంతేకాకుండా, ఎన్నికల్లో అధికార పార్టీకి వ్యతిరేకంగా పని చేసిన ఐపీఎస్ అధికారులను కూడా యాదవ్ హడలెత్తిస్తున్నారు. ఇప్పటికే డీఎస్పీ స్థాయి నుంచి ఎస్పీ, డీఐజీ వరకు నోటీసు జారీ చేసి, వివరణ కోరుతున్నారు. సరిగా వివరణ ఇవ్వని అధికారులపై శాఖాపరమైన చర్య తీసుకోవాల్సిందిగా ఆదేశాలు జారీ చేస్తున్నారు. మొత్తం మీద డీజీపీగా తిరిగి బాధ్యతలు చేపట్టిన యాదవ్ తన మార్కును ప్రతిబింబించేలా నడుచుకుంటున్నారు. ముఖ్యమంత్రి అండ ఉండటం వల్లే ఆయన ఇలా నడుచుకుంటున్నారని పలువురు అధికారులు, రాజకీయ పార్టీ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. అంతేకాకుండా, మీడియాపైనా ఆయన జులుం ప్రదర్శిస్తున్నారు. బాధ్యతలు చేపట్టిన మరుక్షణమే మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి, తనకు వ్యతిరేకంగా వార్తలను ప్రచురించిన వారిపై చిర్రుబుర్రులాడారు. మొత్తం మీద ఇద్దరు ప్రభుత్వ ఉన్నతాధికారుల మధ్య ఏర్పడిన కోల్డ్వార్ ఇతర అధికారులనూ హడలెత్తిస్తోంది. చివరికిది ఎంతవరకూ వెళుతుందో వేచి చూడాలి. |