ప్రజారాజ్యం తొలి పిల్లర్ చివరకు కూలిపోయింది. "మిత్రా మీరు ప్రజారాజ్యంలోనే ఉన్నారుగా"... అంటే "ఇప్పుడు లేను" అనే సమాధానాన్ని చిట్టచివరికి మిత్రా ఇలా ఇచ్చారు. మొత్తానికి చిరంజీవి "ప్రజారాజ్యం" పొలిటికల్ షో ప్రారంభం నుంచి ఎంతో సస్పెన్స్తో నడుస్తోంది. ఒక్కసారి గత ఏడాది ఆగస్టు నెల నుంచి ప్రజారాజ్యం ప్రాభవాన్ని చూస్తే... ఎన్నో గాలివానల సమాహారం మన కళ్ల ముందు కనబడుతుంది. వెండితెరపై తిరుగులేని స్టార్గా వెలుగొందిన చిరంజీవి, ప్రజారాజ్యం పార్టీని స్థాపించినపుడు ఆ పార్టీపై భారీ అంచనాలను పెట్టుకున్నారు చాలామంది. ఏకంగా ప్రభుత్వ పగ్గాలను చేపట్టగలమన్న ధీమాను వ్యక్తం చేశారు కూడా. ఆ ఊపు, ఆశతోనే చాలామంది అప్పట్లో ప్రజారాజ్యం బాట పట్టారు.అయితే ఆ తర్వాత క్రమంగా ప్రజారాజ్యం బలహీనపడుతున్నట్లు కనిపించింది. దీంతో మూడు చేపల కథను గుర్తుకు తెస్తున్నట్లుగా పార్టీ నుంచి జారుకునే "సుమతి, కాలమతి, మందమతి"లు తయారయ్యారు. ఆ క్రమంలో పార్టీలో తమకు ఆశించిన టిక్కెట్లు రాలేదని కొందరు జారుకుంటే, పార్టీలో కీలక స్థానం లభించలేదని అలిగి వెళ్లిపోయినవారు మరికొందరు. ఇలా ఒకరి తర్వాత ఒకరు క్యూ కట్టారు. ఇలా వెళ్లినవారిలో కొందరు నిశ్శబ్దంగా చడీచప్పుడు చేయకుండా ఉండగా, ప్రభాకర్ లాంటివారు ఏకంగా పార్టీ కార్యాలయంలోనే ఆ పార్టీని తూర్పార పట్టారు. ఎంత బురద చల్లాలో అంతా చల్లేశారు. ఒక పార్టీని అదే పార్టీ వేదికపై దుమ్మెత్తి పోయడం బహుశాః అదే అయ్యుంటుందేమో తెలియదు కాని, మొత్తానికి ప్రభాకర్ చేయాలనుకున్నది చేసేశారు. ఆ తర్వాత టిక్కెట్ల పంపిణీ గొడవ. అభ్యర్థి గెలుపు ఓటములతో సంబంధం లేకుండా ఎవరు డబ్బిస్తే వారికి టిక్కెట్లను కట్టబెట్టినట్లు మరో దుమారం. దానికి బాధ్యులు అల్లు అరవింద్ అనీ, ఆయన వల్ల పార్టీ అధోగతి పాలవుతోందని ఆందోళనలు. వీటన్నిటినీ తట్టుకుంటేనే చిరంజీవి అసెంబ్లీ ఎన్నికల బరిలో దిగారు. మెగా అంచనాలను తలకిందులు చేస్తూ మైక్రో సీట్లను మాత్రమే ప్రజారాజ్యానికి కట్టబెట్టారు రాష్ట్ర ప్రజలు. ఈ పరాజయాలు, పార్టీ నుంచి నాయకులు వెళ్లిపోవడాలు... వగైరాలన్నిటికీ చిరంజీవి మానసికంగా ఎప్పుడో సిద్ధమైపోయినట్లు కనబడుతోంది. బహుశాః తనకు ఓటమి రుచి ఏమిటో బాగా తెలిసి ఉండవచ్చు. ఓటమి ఎంతటి భయంకరమైనదో ఆయన చాలా సందర్భాల్లో చెప్పుకున్నారు కూడా. దాదాపు ప్రజారాజ్యం రైలు ఇంజనుకున్న అసమ్మతి చక్రాలన్నీ ఊడి వాటిదారిన అవి వెళ్లిపోయాయి. ఇక ఇప్పుడు చిరంజీవి ముందు ఉన్నది అసలైన పరీక్ష. |