ప్రపంచ పాప్ "రారాజు" మైఖేల్ జాక్సన్ మరణంపై నెలకొన్న మిస్టరీ వీడక ముందే అతని ముగ్గురు పిల్లల భవితవ్యం ప్రశ్నార్థకంగా మారింది. పలు ఊహాగానాలు, ఆందోళనలు ఆరంభమయ్యాయి. వందల కోట్ల రూపాయల సంపాదనతో సరికొత్త రికార్డులపై రికార్డులు సృష్టించిన జాక్సన్కు.. శ్వాస పోయేనాటికి చివరకు అప్పులే మిగిలాయి. దీంతో అతని ముగ్గురు పిల్లల భవిష్యత్ అంధకారంలో పడింది. పిల్లలకు సంబంధించి మైఖేల్ వీలునామా రాశాడా..? లేదా?, ఈ పాప్స్టార్ పిల్లల్ని పెంచి పోషించేది ఎవరు అనే ప్రశ్నలే అందరినీ వేధిస్తున్నాయి. రూ.వేల కోట్ల ఒప్పందాలు. ఒక్క స్టేజ్ షోకే కోట్ల డాలర్లు. డబ్బు మత్తులో మునిగి తేలిన మైఖేల్, ప్రాణం పోయేనాటికి 2500 కోట్ల రూపాయల మేరకు అప్పులు ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. దీనికితోడు విడాకులు, వివాదాలతో నాఅనే వాళ్లంతా దూరమయ్యారు. ఇలాంటి పరిస్థితుల్లో ముగ్గురు పిల్లల భవిష్యత్ ఏమిటనేది ప్రస్తుతం ప్రశ్నార్థకంగా మారింది. విడాకులతో భార్యకు దూరమైనా.. పిల్లల్ని మాత్రం తన వద్దే అట్టిపెట్టుకున్నాడు. వారిని ఎంతో అల్లారు ముద్దుగా పెంచి పోషించాడు. ముగ్గురు పిల్లల్లో మొదటి ఇద్దరు పిల్లలు మైఖేల్ జోసఫ్, ప్యారిస్ మైఖేల్ కాథరిని రెండో భార్య డెబ్బీరోకి పుట్టారు. మూడో బిడ్డ ప్రిన్స్ మైఖేల్-2 తల్లి ఎవరో ప్రపంచానికి ఇప్పటికీ తెలియదు. తన పిల్లల భవితవ్యంపై మైఖేల్ వీలునామా రాశాడా? ఒక వేళ రాస్తే అందులో ఏముంది. అనే ప్రశ్న ప్రతి ఒక్కరి మెదళ్ళను తొలుస్తోంది. ఒకరంకంగా చెప్పాలంటే మైఖేల్ మరణంలాగానే ఇదీ కూడా సస్పెన్స్గా ఉంది. అయితే, పిల్లల పెంపకంపై న్యాయపరమైన చిక్కులు ఉన్నట్టు న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. పిల్లల వయస్సు 18 సంవత్సరాలు వచ్చేంత వరకు ఎవరో ఒకరిని గార్డియన్గా నియమించాలి. దశాబ్దకాలంగా కన్నబిడ్డలకు దూరంగా ఉన్న మొదటి భార్య డెబ్బీరో తిరిగి.. తన పిల్లలను దగ్గరకు చేరదీస్తుందా.? ఒక వేళ తనకు పుట్టిన ఇద్దరు పిల్లలను చేరదీస్తే.. మూడో బిడ్డ పరిస్థితి ఏమిటి? అసలు మైఖేల్కు ఆస్తులు, బ్యాంకు బ్యాలెన్స్, నగదు తదితర వివరాలు బయటకు వెల్లడయితేగానీ, పిల్లల భవితవ్యం తేలదు. ఇదిలావుండగా, మైఖేల్ మరణంపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. పలు స్టేజ్ షోలు చేసేందుకు అంగీకరించిన జాక్సన్, నిర్వాహకుల నుంచి కోట్ల రూపాయలు అడ్వాన్సుగా స్వీకరించాడు. దీంతో వరుసగా యాభై షోలు చేయాల్సి రావడంతో తనకు తానుగా ప్రాణాలు తీసుకున్నాడని కొందరు అంటున్నారు. కుటుంబ సభ్యులో కావాలని చంపేశారని మరికొందరు అంటున్నారు. మొత్తం మీద, పాప్ రారాజు మరణంతో పాటు.. అతని పిల్లల పోషణపై సందేహం నెలకొంది. |