మహిళలకు వేదాలలో ప్రథమ స్థానం కల్పించిన ఈ దేశం ఎటు పోతోంది. నేడు మహిళలపై జరిగిన దాడులే ప్రధాన సాక్ష్యం. వివరాలలోకి వెళితే...
ఉదయం గుంటూరు జిల్లాలో భార్య, కూతురిపై కట్టుకున్న భర్తే యాసిడ్తో దాడి చేశాడు. అగ్నిసాక్షిగా పెళ్ళాడిన భర్తే భార్యను, కన్న కూతురినే హతమార్చేందుకు ప్రయత్నించాడంటే సమాజం ఎటుపోతోంది?
హైదరాబాద్లో ఓ ప్రేమోన్మాది చేతిలో అభం, శుభం తెలియని ఓ అమాయక విద్యార్థిని గాయపడింది. లావణ్య అనే ఈ అమ్మాయి స్థానిక పాలిటెక్నిక్ కళాశాలలో చదువును కొనసాగిస్తోంది. లావణ్యతో కలిసి చదువుకుంటున్న తోటి విద్యార్థి అండగా ఉండాల్సింది పోయి ప్రేమించలేదనే నెపంతో వేటకొడవలితో దాడి చేశాడు.
అంతకుమునుపు ఆ విద్యార్థిని కంప్యూటర్ ల్యాబ్లో ఉండగా అక్కడే ఆమెను లొంగదీసుకునేందుకు ప్రయత్నించినట్లు సమాచారం. కాని ఆమె అతనిని తిరస్కరించటంతో వెంట తెచ్చుకున్న వేటకొడవలితో ఆమెపై దాడికి పాల్పడ్డాడు. కాగా నిందితుడు సుధాకర్ నాయక్, లావణ్యలు వరుసకు బావా మరదళ్ళు.
ఇదిలావుండగా రక్షించాల్సిన రక్షక భటులే భక్షించేవిధంగా తయారైనారంటే మన రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ ఎంత పటిష్టంగా ఉందనేది ఈ సంఘటనే ఉదాహరణ.
వివరాలలోకి వెళితే కృష్ణాజిల్లా మైలవరానికి చెందిన పోలీసులే తనపై అత్యాచారం చేశారని ఓ మహిళ గురువారం ఆరోపించింది. గత నాలుగు నెలలుగా పోలీసులు తనపై అఘాయిత్యానికి పాల్పడ్డారని ఆమె విలేకరులకు తెలిపింది.
నాలుగు నెలల క్రిందట తనకు బావ వరుసయ్యే వ్యక్తితో కలిసి తాను ఓ లాడ్జిలో బస చేశానని, అలాంటి సమయంలో పోలీసులు ఆ లాడ్జిపై దాడులు చేశారని, తాను లాడ్జిలోనున్న దృశ్యాలను సెల్ఫోన్లో చిత్రీకరించారని ఆమె తెలిపింది.
ఆ చిత్రాలను చూపించి తనను లొంగదీసుకున్నారని అప్పటినుంచి తనపై పోలీసులు అఘాయిత్యానికి పాల్పడుతున్నారని ఆమె వాపోయింది.
దీంతో పలు మహిళా సంఘాలు, విద్యార్థి సంఘాలు కలిసి హోంశాఖామంత్రికి వినతి పత్రం సమర్పించి నిందితులను కఠినంగా శిక్షించాలని కోరారు.
ఇదిలావుండగా మహిళలు, అమాయకులైన అభం, శుభం తెలియని అమ్మాయిలపై దాడులు జరగడం దురదృష్టకరమని సికింద్రాబాద్ ఎమ్మెల్యే జయసుధ ఆవేదన వ్యక్తం చేశారు.
మహిళల రక్షణ కోసం ప్రత్యేక టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేసేందుకు హోంమంత్రిత్వ శాఖ నాయకత్వంలో ముమ్మర ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆమె విలేకరులకు వెల్లడించారు.
రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న దాడులను అరికట్టేందుకు హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి, వివిధ మహిళా సంఘాలతో, పలు రాజకీయపార్టీల మహిళానాయకురాళ్ళతో చర్చలు జరపడంతోనే ఈ సమస్యకు పరిష్కారం లభిస్తుందని తెలుగుదేశంపార్టీ ఎమ్మెల్సీ నన్నపనేని రాజకుమారి సూచించారు. మహిళలపై దాడులకు పాల్పడ్డవారిని ప్రభుత్వం కఠినంగా శిక్షించాలని ఆమె కోరారు.
కాగా రాష్ట్రంలో మహిళలపై రోజురోజుకు నీచాతినీచంగా జరుగుతున్న దాడులను రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా పరిగణనలోకి తీసుకుంది. ముఖ్యంగా గురువారంనాడు జరిగిన ఉదంతాలపై రాష్ట్ర డీజీపీ, హోంశాఖ ఉన్నతాధికారులతో రాష్ట్ర హోంశాఖామంత్రి సబితా ఇంద్రారెడ్డి అత్యవసర సమావేశాన్ని నిర్వహించారు.
అనంతరం ఆమె విలేకరులతో ఆమె మాట్లాడుతూ...మహిళల రక్షణకు గ్రామ స్థాయిలో ప్రత్యేక కమిటీలను నియమించనున్నామని ఆమె తెలిపారు.
ఈ కమిటీలలో స్థానిక సర్పంచ్ అధ్యక్షులుగా కొనసాగుతారని, ఎమ్పీటీసీ, డ్వాక్రా మహిళా సంఘం నేతలు, అంగన్వాడీ ఉపాధ్యాయినులు, స్థానిక పోలీసు ప్రతినిధి సభ్యులుగా ఉంటారని ఆమె వివరించారు.
ఇదిలావుండగా యాసిడ్ దాడి బాధితులను రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని, దాడుల నిరోధానికి ప్రత్యేక చట్టాన్ని తెచ్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని, ఎవరైనా యాసిడ్ దాడికి పాల్పడితే ఏడేళ్ళ కఠిన కారాగార శిక్ష విధించేలాగ ముసాయిదా బిల్లును రూపొందించాలని ఉన్నతాధికారులను ఆదేశించినట్లు ఆమె వివరించారు.
కాగా మహిళలకు రక్షణ అనే అంశంపై శుక్రవారం జూబ్లీహాలులో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించనున్నట్లు, ఇందులో పాల్గొనేందుకు దాదాపు 15 స్వచ్ఛంద సంస్థలను ఆహ్వానించినట్లు హోంశాఖాధికారులు తెలిపారు. |