స్వలింగ సంపర్కానికి చట్టబద్ధత కల్పిస్తూ ఢిల్లీ హైకోర్టు గురువారం చారిత్రాత్మక తీర్పునిచ్చింది. స్వలింగ సంపర్కానికి చట్టబద్ధత సబబేనని హైకోర్టు ధర్మాసనం అభిప్రాయపడింది. దీంతో ప్రముఖ బాలీవుడ్ నటి సెలీనా జైట్లీ స్వలింగ సంపర్కులకు శుభాకాంక్షలు తెలిపింది. స్వలింగ సంపర్కాన్ని భారత శిక్షాస్మృతిలోని సెక్షన్ 377 రాజ్యాంగంలోని 21వ ఆర్టికల్కు విరుద్ధమని పేర్కొంది. ఈ సెక్షన్పై కొంతకాలం నుంచి స్వలింగ సంపర్కాన్ని సమర్థిస్తున్న వర్గం నిరసన వ్యక్తం చేస్తూ వస్తోంది. కోర్టు తీర్పుతో 'గే' కార్యకర్తలు సంతోషం వెలిబుచ్చారు.దాదాపు 150 సంవత్సరాలుగా ఉన్న ఈ చట్టంలో మార్పులు తీసుకువచ్చి హైకోర్టు తీసుకున్న ఈ నిర్ణయంపై చాలామంది సంతోషపడ్డారు. దేశవ్యాప్తంగా సంబరాలుకూడా జరుపుకుంటున్నారు. ఇందులో సెలీనా జైట్లీకూడా ఉండటం గమనార్హం. గత పది సంవత్సరాలుగా స్వలింగ సంపర్కులు తమకు చట్టబద్ధత కల్పించాలని పోరాటాలు చేస్తుండగా వారికి అండగా, తోడూ, నీడగా వారి కష్టాల్లో, వారు జరిపిన ఆందోళనల్లో సెలీనా పాలు పంచుకుంది. దీంతో తోటివారు ఆమెను అనరాని మాటలు అన్నారు. అయినప్పటికీ ఆమె వాటికి చలించలేదు. స్వలింగ సంపర్కుల హక్కులకోసం పోరాడారు. హైకోర్టు తన నిర్ణయాన్ని ప్రకటించడంతో ఉప్పొంగిన ఆనందంతో వారికి శుభాకాంక్షలు తెలుపుతూ ఆనందభాష్పాలు రాల్చారు. ఈ సందర్భంగా ఆమె తన బ్లాగులో ఇలా రాసుకున్నారు... "కళ్ళ వెంబడి ఆనంద భాష్పాలు వెలువడుతున్నాయి. స్వలింగ సంపర్కులకు చట్టబద్ధతను సాధించడంకోసం నేను చేసిన పోరాటాన్ని గర్వంగా భావిస్తున్నా. వారికోసం చాలా సంవత్సరాలపాటు పోరాడాను. నాలాంటి వారెందరో చేసిన పోరాటం ఫలితంగానే ప్రస్తుతం భారత దేశంలో స్వలింగ సంపర్కులకు హైకోర్టు చట్టబద్ధత కల్పించింద"ని ఆమె అన్నారు. ఇకపై స్వలింగ సంపర్కులు విదేశాలలోలాగా భారతదేశంలోకూడా తలెత్తుకు జీవించగలరని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. మరోమారు వారందరికీ శుభాకాంక్షలు తెలుపుతున్నట్లు ఆమె తన బ్లాగులో పేర్కొన్నారు. |