అటు ప్రత్యేక తెలంగాణా- ఇటు సమైక్యాంధ్రకోసం రాష్ట్రంలో ఉద్యమాలు జరుగుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం ఈ అంశంపై ఎటువంటి నిర్ణయం తీసుకోలేక కమిటీ పేరుతో కాస్త ఊపిరి పీల్చుకుంటోంది.
ఇదిలావుంటే కాంగ్రెస్ సీనియర్ నాయకుడు కె. కేశవరావు తెలంగాణా రాష్ట్రం వచ్చినట్లేనని శనివారం అసెంబ్లీ హాలులో మీడియా సమావేశంలో వెల్లడించారు. డిసెంబరు 9న ప్రకటన చేసింది పార్టీ కాదనీ, భారతప్రభుత్వం అనీ ఆయన అన్నారు.
ఇదిలావుంటే, రాయలసీమలోని కొంతమంది రాజకీయ నాయకులు సమైక్యవాదాన్ని కాస్త సవరించుకుని కొత్త వాదనను తెరమీదికి తెస్తున్నారు. రాష్ట్రాన్ని విభజించేటట్లయితే రాయలసీమను తెలంగాణాలో కలిపేసి రాయల తెలంగాణా చేయాలని తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.
రాష్ట్ర విభజన జరిగితే... సీమ ప్రజలు తెలంగాణాతో కలిసి ముందుకు వెళ్లాలనుకుంటున్నారని సలహాలు కూడా ఇచ్చేస్తున్నారు. అంతేకాదు, ఒకవేళ రాష్ట్రం విడిపోతే సీమాంధ్ర భౌగోళికంగా కలిసి ఉండటం సాధ్యం కాదనీ, రాజధాని విషయంలో వివాదం తలెత్తే అవకాశం ఉన్నదనీ అంటున్నారు.
ఈ పరిస్థితుల్లో సీమను తెలంగాణాలో కలిపేస్తే ఆ సమస్య ఉండదని ఉచిత సలహా ఇస్తున్నారు. ఇక ఆంధ్ర విషయానికి వస్తే... శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకూ విజయవాడ లేదా గుంటూరు రాజధానిగా చేసుకుని పాలన సాగించవచ్చనీ చెప్పుకొస్తున్నారు. మరి వీరి మాటలు వింటే సమైక్య- తెలంగాణావాదులు ఏమంటారో...?!!