'మందు'కు దూరంగా ఉన్నవారిని 'ముగ్గు'లోకి లాగుతున్న సర్కార్
బుధవారం, 25 జనవరి 2012( 16:55 IST )
WD
పార్టీలు వేరైనా, గద్దె ఎక్కగానే ఆదాయ సముపార్జనకు ఆయా ప్రభుత్వాలకు వెంటనే గుర్తుకు వచ్చేవారు మొదటగా మత్తులో జోగే మందుబాబులే. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఇంకో అడుగు ముందుకు వేసింది. మందుకు దూరంగా బుద్ధిగా పిల్లాపాపలతో సుఖంగా ఉన్న వారిని కూడా మత్తులో జోగేలా పురికొల్పడానికి వారు మత్తులో తూగుతుంటే వారి జేబులు ఖాళీ చేసి ఆదాయాన్ని నింపుకోవాలని ప్రభుత్వం చూస్తున్నట్లు కనిపిస్తోంది.
రాష్ట్రంలో ఇప్పటికే ఇబ్బడిముబ్బడిగా ఉన్న ఎన్నో రకాల మద్యం బ్రాండ్లు చాలవన్నట్లు, కొత్తగా ఆల్కహాల్ శాతం తక్కువ ఉన్న బ్రాండ్ల వంకతో కొత్తవాటిని ప్రజల్లోకి వదలాలని చూస్తోంది. అందులో భాగంగా ఎటువంటి ద్రవ మిశ్రమాల అవసరం లేకుండానే నేరుగా తాగే (రెడీ టూ డ్రింక్) బీరు, వైన్ లాంటి మద్య పానీయాలను పోలిన బ్రాండ్ విక్రయాలకు మంగళవారం నుండి ప్రభుత్వం గేట్లెత్తింది. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులను జారీచేసి, ప్రజల ఆరోగ్యం కన్నా, వారి జేబు పైనే తనకెంత మక్కువో నిరూపించుకుంది. పుదుచ్చేరికి చెందిన ఒక కంపెనీ ఈ విక్రయాలకు అనుమతి కొట్టేసింది.
పళ్లూడగొట్టడానికి ఏ రాయి అయితేనేమి? మద్యపానం అలవాట్లను ఈ కాలానికి తగినట్లుగా మార్చడానికని చెపుతూ కొత్తరకం మద్యం అమ్మకాలను ప్రోత్సహిస్తున్నట్లు ప్రభుత్వం చెబుతున్నప్పటికీ, ప్రభుత్వ పరమ ప్రయోజనం ఆదాయం పెంపుగానే తోస్తోందని విమర్శకులు అంటున్నారు. అందులో భాగంగానే ఈ కొత్త పాట ఎంచుకుందని అంటున్నారు. ఇప్పటికే రెడీ టూ డ్రింక్ వర్గానికి చెందిన బీర్, వైన్ లాంటివి మార్కెట్లో ఉండగా ఇప్పుడీ కొత్త బ్రాండ్ల అవసరమేమోచ్చిందని వారు వ్యాఖ్యానిస్తున్నారు.
పులియబెట్టిన పండ్ల రసాలనే రెడీ టూ డ్రింక్ అంటారని కొందరంటున్నా అందులో ఏమాత్రం నిజం లేదని, తొలుత ఆల్కహాల్ కంటెంట్ తక్కువగా ఉన్నట్లు ప్రచారం జరిగే ఈ తరహా పానీయాలకు అలవాటుపడిన వారు క్రమంగా ఎక్కువ మోతాదు ఆల్కహాల్ కలిగి ఉన్న మద్యాలకు అలవాటుపడి జీవితాలను నాశనం చేసుకుంటారనే వాదనలు వినిపిస్తున్నాయి.