అమెరికాతో కుదుర్చుకున్న పౌర అణు ఒప్పందం అమలును భారత ప్రభుత్వం నిలుపుదల చేసినప్పటికీ, ఒప్పందం అమలవుతుందనే విశ్వాసాన్ని అమెరికా అధ్యక్షభవనమైన వైట్హౌస్ వ్యక్తం చేసింది. అణు ఒప్పందంపై యూపీఏ-లెఫ్ట్ కమిటీ సోమవారంనాటి భేటీ అసంపూర్ణంగా ముగిసిన నేపథ్యంలో వైట్హౌస్ అధికార ప్రతినిధి టోనీ ఫ్రాట్టో మీడియాతో మాట్లాడుతూ ఒప్పందం వీగిపోయిందంటూ ఇప్పుడే నిర్ణయించడం సరికాదని అన్నారు.
ఒప్పందం అమలులో చోటు చేసుకున్న ఇబ్బందులపై భారత ప్రధాని మన్మోహన్ సింగ్, అమెరికా అధ్యక్షుడు జార్జి బుష్కు తెలియజేసిన వారం రోజులకు కూడా సంక్షోభం సమసిపోకపోవడం పట్ల అమెరికా వైఖరిని మీడియా ప్రశ్నించగా తామిప్పటికీ ఒప్పందం అమలుకు కట్టుబడి ఉన్నట్లు టోనీ సమాధానమిచ్చారు.
ఒప్పందం అమలుపై తాము భారత్తో కలిసి పనిచేస్తామని టోనీ స్పష్టం చేసారు. అమెరికా తరహాలో భారత్ కూడా స్థానిక రాజకీయ పక్షాలతో తమ విధానాలపై చర్చించడం ప్రజాస్వామ్యంలో పరిపాటిగా వస్తున్న సంప్రదాయంగా ఆయన తెలిపారు.
|