కామన్వెల్త్ కూటమిలోని తక్కువ జనాభా కలిగిన దేశాలకు వాణిజ్య పరమైన సాయం అందించేందుకు కృషి చేస్తామని కామన్వెల్త్ నూతన కార్యదర్శి కమలేశ్ శర్మ స్పష్టం చేశారు. ఈ కూటమి ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైన తొలి భారతీయుడిగా చరిత్ర సృష్టించిన కమలేశ్.. విలేకరులతో మాట్లాడుతూ తక్కువ జనభా కలిగిన పలు దేశాలు వివిధ రకాల సాయం కోసం అభివృద్ధి చెందుతున్న, చెందిన దేశాల సాయం కోసం ఎదురు చూస్తున్నాయన్నారు. ముఖ్యంగా.. వాణిజ్యపరమైన చర్చల్లో తక్కువ జనభా కలిగిన దేశాలకు అధిక ప్రాధాన్యత కల్పించేందుకు తాను కృషి చేస్తానని చెప్పారు.
వచ్చే ఏడాది ఏప్రిల్లో పదవీ బాధ్యతలు చేపట్టనున్న కమలేశ్ శర్మ బ్రిటన్లో దౌత్యవేత్తగా పనిచేశారు. 1965లో కామన్వెల్త్ సచివాలయం ప్రారంభమైనప్పటి నుంచి ప్రధాన కార్యదర్శులుగా బాధ్యతలు చేపట్టిన వారిలో కమలేశ్ ఐదో వ్యక్తి. కామన్వెల్త్ 53 సభ్య దేశాల్లో 32 చిన్న దేశాలున్నాయని, ఈ దేశాల జనాభా సరాసరి 1.5 మిలియన్ల కంటే తక్కువగా ఉందని కమలేశ్ వివరించారు.
|