నేపాల్లో కొత్తగా ఏర్పాటు కానున్న మావోయిస్టు నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వం విదేశీ పెట్టుబడులను ప్రోత్సహిస్తుందని మావోయిస్టు సుప్రిమో ప్రచండ ప్రకటించారు. అలాగే ప్రైవేటు రంగాన్ని ప్రోత్సహిస్తామని తెలిపారు. అయితే ఎట్టిపరిస్థితుల్లోని నియంత పాలనకు అంగీకరించబోమని ప్రచండ స్పష్టం చేశారు. వాణిజ్య ప్రతినిధులతో గురువారం జరిగిన ముఖాముఖి సంభాషణల్లో ఈ వ్యాఖ్యలు చేశారు.
కొత్తగా ఏర్పాటయ్యే ప్రభుత్వం దేశంలోని ఆర్థిక రంగంలో సరికొత్త విప్లవానికి నాంది పలికేందుకు విదేశీ పెట్టుబడులను ప్రోత్సహిస్తామని ఆయన తెలిపారు. అంతేకాకుండా ప్రస్తుత పరిస్థితుల్లో దేశంలోని పరిశ్రమలను జాతీయం చేయబోమని ఆయన ప్రకటించారు. అయితే ప్రైవేటు పెట్టుబడులకు అనుమతిస్తూ విదేశీ పెట్టుబడులను ప్రోత్సహిస్తామని ఆయన తెలిపారు.
అంతేకాకుండా పారిశ్రామికవేత్తలు తమ మనోధైర్యాన్ని కోల్పోరాదని, దేశంలోని పరిశ్రమలను స్వాధీనం చేసుకోబోమని ఆయన భరోసా ఇచ్చారు. అలాగే దేశంలో ఆర్థిక సౌభాగ్యం వర్థిల్లేందుకు ప్రతి ఒక్కరి సహకారం అవసరం కావాలని ఆయన కోరారు. నేపాల్లో ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో మావోయిస్టులు విజయకేతనం ఎగురవేసిన విషయం తెల్సిందే. దీంతో నేపాల్లో సంకీర్ణ ప్రభుత్వం త్వరలో ఏర్పాటు కానుంది.
|