ఉరిశిక్షను ఎదుర్కోనున్న భారత ఖైదీ సరబ్జిత్కు ప్రాణదానం చేయాలని పాకిస్థాన్కు భారత్ మరో మారు విజ్ఞప్తి చేసింది. ముఖ్యంగా మానవతా దృక్పథంతో సరబ్జిత్ను విడుదల చేయాలని కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రణబ్ ముఖర్జీ పాకిస్థాన్ ప్రభుత్వాన్ని కోరారు. ఇదిలావుండగా భారత భూభాగంలోకి అక్రమంగా ప్రవేశించిన ఇద్దరు పాకిస్థాన్ యువకులను భారత్ దాయాది దేశానికి అప్పగించి, తన మానవతను చాటుకుంది.
ఈ చర్య ఇరు దేశాల మధ్య సుహృద్భావ వాతావరణం నెలకొనేలా చేసింది. అలాగే పాకిస్థాన్ ప్రభుత్వం కూడా సరబ్జిత్ విషయంలోనూ ఇలాగే స్పందించాలని ఆయన కోరారు. గతంలో లాహోర్లో జరిగిన బాంబు పేలుళ్ళ కేసులో సరబ్జిత్కు పాక్ కోర్టు ఉరిశిక్ష విధించిన విషయం తెల్సిందే. కోర్టు ఆదేశాల ప్రకారం సరబ్జిత్ను ఈనెల ఒకటో తేదీన ఉరికంభానికి వేలాడదీయాల్సింది.
అయితే అంతర్జాతీయ సమాజం మూలంగా పాకిస్థాన్పై ఒత్తిడి తెచ్చింది. దీంతో పాక్ అధ్యక్షుడు ముషారఫ్ ఆదేశం మేరకు ఉరిని మే ఒకటో తేదీకి వాయిదా వేసింది. అయితే సరబ్జిత్ను మానవతా దృక్పథంతో విడుదల చేయాలని ప్రణబ్ మరో మారు విజ్ఞప్తి చేశారు.
ఇదిలావుండగా.. సింధు ప్రావిన్సుకు చెందిన అజహార్ ఆలీ (18), అతని సోదరుడు జోహాబ్ ఆలీ (10)లు భారత భూభాగంలోకి అక్రమంగా చొరబడ్డారు. వీరిని భారత భద్రతా దళాలు పాకిస్థాన్కు అప్పగించారు.
|