బాంబు పేలుళ్ళ ఆరోపణల కారణంగా భారతీయ ఖైదీ సరబ్జిత్కు విధించిన ఉరిశిక్ష అమలును మరో మారు వాయిదా వేసే ప్రసక్తేలేదని పాకిస్థాన్ అధ్యక్ష భవనం ప్రతినిధి స్పష్టం చేశారు. ఈనెల ఒకటో తేదీన సరబ్జిత్కు ఉరిశిక్ష అమలు చేయాల్సి ఉంది. అయితే భారత్ విజ్ఞప్తి మేరకు ముషారఫ్ ఒక నెల రోజుల పాటు శిక్షను వాయిదా వేశారు. ఈ నేపథ్యంలో ఈ శిక్షను మరో మారు నెల రోజుల పాటు వాయిదా వేసినట్టు పాకిస్థాన్తో పాటు.. భారతదేశ మీడియాలో వార్తలు వచ్చాయి.
ఈ వార్తలను అధ్యక్ష భవనం ప్రతినిధి మేజర్ జనరల్ (రిటైర్డ్) రషీధ్ ఖురేషి ఖండించారు. ఇదిలావుండగా.. భారత విదేశాంగ మంత్రి ప్రణబ్ ముఖర్జీ శుక్రవారం కూడా మళ్లీ మరోసారి విజ్ఞప్తి చేశారు. మానవతా కోణంలో ఆలోచించి సరబ్జిత్కు ప్రాణభిక్ష పెట్టాలని ఆయన కోరారు. దీనిపై పాకిస్థాన్ ప్రభుత్వం తరపు నుంచి ఎలాంటి అధికార సమాచారం రాలేదు.
దీనిపై సరబ్జిత్ తరపు న్యాయవాది రాణా అబ్దుల్ హమీద్ మాట్లాడుతూ ఇలాంటి కేసుల్లో క్షమాభిక్ష ప్రసాదించే అధికారం దేశాధ్యక్షుడికి మాత్రమే ఉందని పేర్కొన్నారు. ప్రముఖ మానవ హక్కలు సంఘం కార్యకర్త అన్సర్ బర్నే మాట్లాడుతూ పాక్ అధ్యక్షునికి సరబ్జిత్ కొత్తగా క్షమాభిక్ష వినతిపత్రాన్ని సమర్పించుకోవాలని అభిప్రాయపడ్డారు. పాకిస్థాన్ కోర్టు సరబ్కు వ్యతిరేకంగా ఇచ్చిన తీర్పులో పలు లోపాలు ఉన్నాయని ఆయన గుర్తు చేశారు.
|