టిబెట్ మతగురువు, శాంతిదూత దలైలామా ప్రతినిధితో సమావేశమయ్యేందుకు చైనా అంగీకరించింది. చైనా నిర్ణయానికి అగ్రదేశం అమెరికాతో సహా ప్రపంచ దేశాలు హర్షం వ్యక్తం చేశాయి. స్వయం ప్రతిపత్తి కోసం పోరాటం చేస్తున్న టిబెటెన్లపై చైనా పోలీసులు ఉక్కుపాదం మోపి ఆందోళనలను అణచి వేసిన విషయం తెల్సిందే.
ఈ చర్య ప్రపంచ వ్యాప్తంగా విమర్శలకు దారి తీయడమే కాకుండా.. ప్రపంచ దేశాలు ముక్తకంఠంతో ఖండించాయి. ఇదిలావుండగా దలైలామాతో చైనా ప్రభుత్వం తక్షణం చర్యలు జరపాలని అమెరికా అధ్యక్షుడు జార్జ్ బుష్ పలు మార్లు చైనాను కోరారు. దీనిపై తొలుత ఆగ్రహం వ్యక్తం చేసిన చైనా.. ఎట్టకేలకు ప్రపంచ దేశాల ఒత్తిడికి తలొగ్గి దలైలామా ప్రతినిధితో చర్చలు జరిపేందుకు సమ్మతించింది.
ఈ చర్చల్లో చైనా ప్రభుత్వానికి వ్యతిరేకంగా టిబెట్లో కొనసాగుతున్న నిరసనలపై కూలంకుషంగా చర్చిస్తారని చైనా అధికారులు వెల్లడించారు. అంతేకాకుండా దలైలామా, టిబెటెన్ల అంశంలో ప్రభుత్వం అనుసరించే వైఖరిలో ఎలాంటి మార్పు ఉండబోదనీ చైనా తేల్చి చెప్పింది.
దీనిపై ఫ్రెంచ్ అధ్యక్షుడు నికోలస్ సర్కోజీ స్పందిస్తూ దలైలామాతో చైనా ప్రతినిధులు సమావేశం కావాలని భావించడం కీలక నిర్ణయమని, టిబెట్ సమస్య పరిష్కారానికి ఈ చర్చలు దోహద పడాలని కోరుకుంటున్నట్టు చెప్పారు. టిబెట్ సమస్య పరిష్కారం కాని పక్షంలో వచ్చే ఆగస్టు నెల ఎనిమిదో తేదీన జరిగే బీజింగ్ ఒలింపిక్ పోటీలకు సర్కోజీ హాజరుకాబోనని హెచ్చరించిన విషయం తెల్సిందే.
|