భారత్ - అమెరికా దేశాల మధ్య కుదిరిన పౌర అణు ఒప్పందం మృత్యువాత పడలేదని వైట్హౌస్ స్పష్టం చేసింది. ఈ ఒప్పందం మరుగున పడిపోయిందని తాము ఎట్టిపరిస్థితుల్లోను ప్రకటించలేమని వైట్హౌస్ పత్రికా విభాగ కార్యదర్శి డానా పెరినో మంగళవారం ఒక పత్రికా ప్రకటనలో పేర్కొన్నారు. భారత్లోని ముఖ్యంగా యూపీఏలోని కీలక భాగస్వామ్య పార్టీలైన వామపక్షాలు అమెరికాతో కుదుర్చుకున్న ఒప్పందాన్ని అమలు చేసేందుకు తీవ్ర వ్యతిరేకత తెలుపుతున్న విషయం తెల్సిందే. ఈ కారణంగా ఒప్పందం అమలులో తీవ్ర జాప్యం జరుగుతోంది.
ఈ పరిస్థితుల్లో కొంతమంది మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు పెరినో పైవిధంగా సమాధానం ఇచ్చారు. ఈ ఒప్పందం ఎంతో కీలకం. ఒప్పందానికి ప్రాణం పోయిందని తాము చెప్పలేమని వ్యాఖ్యానించారు. అణు ఒప్పందం వల్ల కలిగే అవసరాలను భారత ప్రభుత్వం గుర్తెరిగినందుకు అభినందలు తెలుపుతున్నాం. ఏకాభిప్రాయసాధన కోసం యూపీఏ ప్రభుత్వం కృషి చేస్తోంది. ఈ ఒప్పందం ఇరు దేశాలకు ఎంతో కీలకమని అధికార కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి అభిషేక్ సింఘ్వీ ఇటీవల అమెరికా పర్యటనలో పేర్కొన్నారని ఆమె గుర్తు చేశారు.
|