టిబెట్ రాజధాని లాసాలో అల్లర్లకు పాల్పడిన వారిలో 17 మందికి జైలుశిక్ష విధించారు. వీరికి మూడు నుంచి జీవిత కారాగార శిక్షలను విధించినట్టు చైనా అధికారిక న్యూస్ ఏజెన్సీ జినువా మంగళవారం వెల్లడించింది. ఇంతకుమించిన వివరాలను ఆ ఏజెన్సీ వెల్లడించలేదు. స్వయంప్రతిపత్తి కోసం గత నెలలో టిబెట్ ఆందోళనకారులు చైనా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు చేపట్టిన విషయం తెల్సిందే.
ఇవి తీవ్రరూపం దాల్చడంతో టిబెట్ రాజధాని లాసాలో అల్లర్లు చెలరేగి, హింసాత్మకంగా మారాయి. పలువురు ఆందోళనకారులు భవనాలకు, ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తుల ధ్వంసానికి పాల్పడటమే కాకుండా.. నిప్పంటించారు. దీంతో రంగంలోకి దిగిన చైనా పోలీసులు ఉక్కుపాదం మోపి అల్లర్లను అణచి వేశారు.
కాగా, ఈ అల్లర్లలో 22 మంది మృతి చెందినట్టు చైనా ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. అయితే.. టిబెట్ ఆందోళన సంస్థలు మాత్రం చైనా ప్రకటనను తీవ్రంగా ఖండించాయి. పలుసార్లు చైనా పోలీసులు జరిపిన కాల్పుల్లో అనేక మంది ప్రాణాలు కోల్పోయారని పేర్కొంటున్నాయి.
|