మియన్మార్ను అల్లకల్లోలం చేసిన నర్గిస్ తుఫాను దాటికి మృతి చెందిన వారి సంఖ్య 22 వేలకు పైగా చేరుకుంది. తుఫాను భీభత్సంలో చిక్కుకున్న మియన్మార్కు సాయం అందించేందుకు ప్రపంచ దేశాలు చేతులు కలపాయి. ఇందులోభాగంగా భారత్ ఇప్పటికే రెండు నౌకలు, విమానాల్లో వస్తు సామగ్రిని పంపింది. అలాగే అంతర్జాతీయ సమాజంతో చేతులు కలిపింది.
నర్గిస్ తుఫాను ధాటికి 22,464 మంది మంది ప్రాణాలు కోల్పోయినట్టు ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే వార్తా సంస్థ పేర్కొంది. అలాగే.. సుమారు 40 వేల మంది ఆచూకీ తెలియడం లేదని వెల్లడించింది. గత శనివారం తెల్లవారుజామున మియన్మార్లోని అతిపెద్ద నగరమైన యాంగాన్ను నర్గీస్ తుఫాన్ తాకిన విషయం తెలిసిందే. ఈ తుఫాను తీరం దాటిన సమయంలో వీసిన భారీ గాలులకు పెద్ద భవనాలు, వృక్షాలు నేలకొరిగాయి.
ఇర్రావడ్డీ నదీ పారివాహక ప్రాంతంలో సహాయక చర్యలు చేపట్టడం కష్టంగా మారింది. తుఫాను భీభత్సానికి రహదారులు, కమ్యూనికేషన్, విద్యుత్ వ్యవస్థ పూర్తిగా ధ్వంసమైంది. ఇదిలావుండగా.. ఐక్యరాజ్య సమితి ప్రపంచ ఆహార పథకం కింద ఆహార ధాన్యాలను మియన్మార్కు పంపేందుకు చర్యలు చేపట్టింది. మరో 48 గంటల్లో మరింత సహాయాన్ని అందివ్వగలమని ఐరాస ఆహార పథకం సంస్థ వ్యాఖ్యాత పాల్ రైస్లీ చెప్పారు.
|