మన రాష్ట్రానికి చెందిన విద్యార్థి జ్యోతిర్మయి హత్య కేసులో అరెస్టు చేసిన నిందితుడుని లండన్ పోలీసులు శుక్రవారం కోర్టులో హాజరుపరుచనున్నారు. విజయవాడకు చెందిన జ్యోతిర్మయి వెంపాల (23) అనే విద్యార్థి లండన్లోని వోల్వర్హాంప్టన్ విశ్వవిద్యాలయంలో ఎంఎస్ చదువుతున్న విషయం తెల్సిందే.
గత మంగళవారం జ్యోతిర్మయి అనుమానాస్పద స్థితిలో తన గదిలో హత్యకు గురైంది. ఈ పరిస్థితుల్లో ఆంధ్రకే చెందిన నాగరాజు కుమార్ నల్లూరి అనే యువకుడిని ఈ కేసులో నిందితునిగా లండన్ పోలీసులు భావించారు. అయితే నాగరాజు తీవ్ర గాయాలతో బర్మింగ్హ్యామ్లోని సిటీ ఆస్పత్రిలో చికిత్స పొందుతుండటంతో తొలుత అరెస్టు చేయలేదు. నాగరాజు కుమార్ అస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యాక పోలీసులు అరెస్టు చేశారు.
అనంతరం బర్మింగ్హ్యామ్ మేజిస్ట్రేట్ కోర్టులో హాజరుపరిచారు. ఈ హత్య కేసు విచారణలో నాగరాజు అన్ని విధాలా సహకరిస్తున్నాడని వెస్ట్మిడ్లాండ్ పోలీసులు పీటీఐ వార్తా సంస్థకు తెలిపారు. జ్యోతిర్మయిని హత్య చేయడానికి గల కారణాలను నిందితుడు కోర్టుకు వెల్లడించవచ్చని పోలీసులు భావిస్తున్నారు.
హ్యాండ్స్వర్త్కు 11 కిలోమీటర్ల దూరంలో ఉన్న విశ్వవిద్యాలయంలో హెల్త్ సైన్సెస్లో జ్యోతిర్మయి పీజీ కోర్సు చేస్తూ.. బర్మింగ్హ్యామ్కు శివారు ప్రాంతమైన హ్యాండ్స్వర్త్లోని ఓ అద్దె ఇంటిలో నివశిస్తోంది. జ్యోతిర్మయి హత్య పట్ల విశ్వవిద్యాలయం తీవ్ర సంతాపం వ్యక్తం చేసింది. మంచి తెలివితేటలు కలిగిన జ్యోతిర్మయి, మంచి ఉత్సాహవంతురాలని కమ్యూనికేషన్ డైరక్టర్ అస్హర్ ఎస్సాన్ విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
|