రాజ్యాంగ సభ ఎన్నికల అనంతరం కూడా మావోయిస్టులు హింసాత్మక సంఘటనలకు పాల్పడటం పట్ల నేపాల్ రాజకీయ పార్టీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఇటీవల అధికార నేపాలీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపై మావోయిస్టులు దాడి చేసి గాయపరిచారు. దీనిపై ఎన్సీ తీవ్రంగా స్పందించింది.
దీనిపై ఆ పార్టీ ముఖ్య కార్యదర్శి శోభాకర్ పరజులి ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. నేపాలీ కాంగ్రెస్ కార్యకర్తలపైనా, వారి ఇళ్లు, దుకాణాలపై జరిగిన అప్రజాస్వామిక దాడులను తీవ్రంగా ఖండిస్తున్నాం. మావోయిస్టు పార్టీ కార్యకర్తల దాడుల్లో గాయపడిన బాధితులకు ప్రభుత్వం తగిన నష్టపరిహారం చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు.
పశ్చిమ నేపాల్లోని రోల్పా సమీపంలోని జుగా గ్రామంలోని రామ్ లాల్ పరియార్ అనే ఎన్సీ కార్యకర్త వేలుని కత్తిరించారని ఆయన తెలిపారు. అలాగే ఖోటాంగ్ జిల్లాలోని సప్తేశ్వర్ ప్రాంతానికి చెందిన మరో ఎన్సీ కార్యకర్త ఇంటికి కూడా మావోయిస్టులు నిప్పంటించారని పేర్కొన్నారు.
గత నెలలో జరిగిన రాజ్యాంగ సభ ఎన్నికల అనంతరం మావోయిస్టులు కొన్ని జిల్లాల్లో ఘర్షణలకు పాల్పడుతూ భయాందోళనలు సృష్టిస్తున్నారని ఎన్సీ, యూఎంఎల్ పార్టీలు ఆరోపించాయి. తమ ఘర్షణాత్మక వైఖరిని వీడకుంటే మావోయిస్టుల నేతృత్వంలో ఏర్పాటయ్యే ప్రభుత్వంలో తాము చేరబోమని యూఎంఎల్ పార్టీ ప్రకటించింది.
|