బంగ్లాదేశ్ జాతీయ ఎన్నికలు వచ్చే డిసెంబరులో జరుగుతాయని ఆ దేశంలోని ఆపద్ధర్మ ప్రభుత్వం ప్రకటించింది. జాతీయ ఎన్నికలు డిసెంబరు మూడో వారంలో ఏ రోజైనా నిర్వహిస్తామని ప్రభుత్వ ముఖ్య సలహాదారు ఫక్రుద్ధీన్ అహ్మద్ వెల్లడించారు. ఎన్నికల పోలింగ్ జరిగే తేదీని త్వరలోనే ప్రకటిస్తామని చెప్పారు.
దేశంలో సైనిక సహకారంతో నడుస్తున్న ఆపద్ధర్మ ప్రభుత్వం రాజకీయ మార్పిడికి సిద్ధమైందని చెప్పారు. దేశంలోని అన్ని రాజకీయ పార్టీల నేతలతో ఈనెల 22వ తేదీ నుంచి చర్చలు జరుపుతుందన్నారు. ఇందులోభాగంగా మంగళవారం (మే 13వ తేది) నుంచి స్వదేశీ రాజకీయాల (ఇండోర్ పాలిటిక్స్)కు అనుమతి ఇస్తామని ఆయన ప్రకటించారు.
దేశంలోని సుహృద్భావ వాతావరణం నెలకొనేందుకు స్టేట్ ఆఫ్ ఎమర్జెన్సీ కింద మిగిలిన అంశాలపై నిషేధం విధిస్తామని చెప్పారు. ప్రస్తుత ఆపద్ధర్మ ప్రభుత్వం ఈ ఏడాది ఆఖరు తర్వాత అధికారంలో కొనసాగబోదని, అయితే.. దేశంలో సుస్థిర ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి అధికార పీఠం నుంచి వైదొలుగుతుందని ఆయన చెప్పుకొచ్చారు.
గత 2007 సంవత్సరం జనవరి 11వ తేదీన బంగ్లాదేశ్లో సైనిక సహకారంతో ఆపద్ధర్మ ప్రభుత్వం ఏర్పాటైంది. సైనిక ప్రభుత్వం ఏర్పడ్డాక ఆ దేశ మాజీ ప్రధానులు షేక్ హసీనా, ఖలీదా జియాలపై అవినీతి కేసులు బనాయించి, జైలు పాలు చేసిన విషయం తెల్సిందే. ఆ తర్వాత దేశంలో పలు సంస్కరణలు చేపట్టి, డిసెంబరు నెలలో జాతీయ అసెంబ్లీకి ఎన్నికలు నిర్వహించేందుకు చర్యలు చేపట్టింది.
|