బంగ్లాదేశ్లో బుధవారం రెండు రైళ్ళు ఢీకొన్న ప్రమాదంలో తొమ్మిది మంది ప్రయాణికులు మృతి చెందారు. మరో 60 మంది గాయపడ్డారు. వీరిలో కొందరి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. దేశ రాజధాని ఢాకాకు 80 కిలోమీటర్ల దూరంలో ఉన్న అషుగంజ్ జంక్షన్లో ప్రమాదం జరిగినట్టు రైల్వే అధికారులు వెల్లడించారు.
దీనిపై రైల్వే ప్రతినిధి షఫీక్యూ అహ్మద్ ఖాన్ మాట్లాడుతూ.. ఢాకా నుంచి ఆగ్నేయ నాఖాలికి వెళ్లే నాఖాలి ఎక్స్ప్రెస్, ఈశాన్య షైల్హాట్ ప్రాంతానికి వెళ్లే ఇంటర్ సిటీ ఉపాపన్ ఎక్స్ప్రెస్ను ఢీకొంది. ప్రమాద స్థలంలోనే ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయినట్టు చెప్పారు.
నాఖాలీ ఎక్స్ప్రెస్ ఇంజిన్తో పాటు.. రెండు రైళ్ళకు చెందిన కొన్ని బోగీలు పూర్తిగా ధ్వంసమైనట్టు ఆయన చెప్పారు. క్షతగాత్రులను సమీపంలోని వివిధ ఆస్పత్రులకు తరలించినట్టు చెప్పారు. కాగా, తొమ్మిదో వ్యక్తి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచాడని అహ్మద్ ఖాన్ వివరించారు.
|