ఈనెల ఒకటో తేదీ నుంచి 14వ తేదీ వరకు జరిగిన ఘర్షణల్లో 368 మంది ఎల్టీటీఈ తీవ్రవాదులు హతమైనట్టు శ్రీలంక రక్షణ శాఖ ప్రతినిధి వెల్లడించారు. అలాగే 41 మంది జవాన్లు ప్రాణాలు కోల్పోగా, మరో 438 మంది గెరిల్లా తీవ్రవాదులు గాయపడినట్టు ఆర్మీ ప్రతినిధి వెల్లడించారు. మే ఒకటో తేదీ నుంచి 14వ తేదీ వరకు ఇరు వర్గాల మధ్య జరిగిన దాడుల్లో ఎల్టీటీఈ సంస్థకు తీవ్ర నష్టం వాటిల్లిందన్నారు.
అలాగే 41 మంది జవాన్లు మృతి చెందగా 155 మంది జవాన్లు గాయపడినట్టు పేర్కొన్నారు. ఇక పోతే 14 మంది అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోగా 39 మంది గాయపడ్డారని ఆయన వివరించారు. తీవ్రవాదులకు పట్టున్న వన్ని ప్రాంతంలో పాఠశాలలకు చెందిన చిన్నారులను ఎల్టీటీఈ ఎంపిక చేసి, శిక్షణ ఇస్తోందని శ్రీలంక రక్షణ శాఖ ఆరోపించింది.
కిలినోచ్చి, ముల్లైదీవు ప్రాంతాల్లో సీనియర్ పాఠశాల పరీక్షలకు అనుమతించని విద్యార్థులను బలవంతంగా ఎల్టీటీఈ సంస్థ రిక్రూట్ చేస్తోందని రక్షణ శాఖ ప్రతినిధి ఆరోపించారు. ఇదిలావుండగా.. ఎల్టీటీఈ తీవ్రవాద శిక్షణ జరిగే క్యాంపుపై శ్రీలంక ఎయిర్ ఫోర్స్ జట్ ఫైటర్స్ దాడులు జరిపినట్టు చెప్పారు. దక్షిణ ములన్కవిల్ ప్రాంతానికి నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న కొల్లన్విల్లులో ఎల్టీటీఈ ట్రైనింగ్ క్యాంపుపై జెట్ ఫైటర్స్ బాంబులు వేశాయని ఆయన తెలిపారు.
|