పాకిస్థాన్ సంకీర్ణ ప్రభుత్వంలో మరో వివాదం చెలరేగింది. మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ నేతృత్వంలోని పాకిస్థాన్ ముస్లిం లీగ్ (ఎన్) అధికారంలో ఉన్న పంజాబ్ రాష్ట్రానికి కొత్తగా నియమించిన గవర్నర్ పట్ల ఆ పార్టీ నేతలు తీవ్ర వ్యతిరేకత తెలిపారు. పంజాబ్ ప్రొవియన్స్కు ప్రముఖ పారిశ్రామికవేత్త సల్మాన్ తసీర్ను నియమిస్తూ ఆ దేశ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ నిర్ణయం తీసుకున్నారు.
దీనికి ప్రధాని గిలానీ కూడా అంగీకారం తెలిపారు. ఈ నిర్ణయంపై పీఎంఎల్ (ఎన్) నేతలు తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ అంశంపై పీఎంఎల్ (ఎన్) సీనియర్ నేత ఛౌదరి నిస్సార్ ఆలీఖాన్ గురువారం లాహోర్లో విలేకరులతో మాట్లాడుతూ.. వివాదాస్పద వ్యక్తిని పంజాబ్ గవర్నర్గా నియమించారన్నారు. ముఖ్యంగా ఈ రాష్ట్ర గవర్నర్ను నియమించే ముందు అధికార పార్టీని సంప్రదించలేదని ఆయన ఆరోపించారు.
సుప్రీం కోర్టు న్యాయమూర్తుల పునర్నియామకంపై అభిప్రాయభేదాలు తలెత్తి మంత్రివర్గం నుంచి వైదొలగిన పీఎంఎల్ (ఎన్) మంత్రుల రాజీనామాలను కూడా ప్రధాని గిలానీ తక్షణం ఆమోదించాలని ఆయన డిమాండ్ చేశారు. దీనిపై పీపీపి నేతలు వెంటనే స్పందించారు.
గవర్నర్ నియామకంపై తమ పార్టీ కో-చైర్మన్ ఆసిఫ్ అలీ జర్ధారీ.. పంజాబ్ ప్రొవియన్స్కు చెందిన అధికార పార్టీ నేతలు, పంజాబ్ ముఖ్యమంత్రితో సంప్రదింపులు జరిపాకే గవర్నర్గా తస్సీర్ను నియమించారని పీపీపి ప్రతినిధి ఫర్హతుల్లా బాబర్ ఇస్లామాబాద్లో మీడియాకు స్పష్టం చేశారు.
|