ఇటీవల సంభవించిన భూకంపం ధాటికి మృతి చెందిన వారి సంఖ్య 22 వేలకు చేరుకుందని చైనా ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. అయితే అనధికారిక లెక్కల ప్రకారం మృతుల సంఖ్య యాభై వేలకు దాటగా, వేలాది మంది గాయపడ్డారు. లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు. ఇదిలావుండగా భూకంపం నుంచి బయటపడిన వారిని రక్షించేందుకు చైనా సహాయక బృందాలు శతవిధాలా కృషి చేస్తున్నాయి.
కాగా, శుక్రవారం వంద గంటల పాటు శిథిలాల కింద చిక్కుకున్న ఒక వ్యక్తిని సహాయక బృందాలు రక్షించాయి. చైనా కేబినెట్ శుక్రవారం అత్యవసరంగా సమావేశమైంది. నైరుతి సిచువాన్ ప్రొవియన్స్లో సంభవించిన భూకంపంలో ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 22,069గాను, క్షతగాత్రుల సంఖ్య 1,68,669గా ఉందని చైనా ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది.
అయితే ఆ దేశ అధికారిక వార్తా సంస్థ మాత్రం ఒక్క సిచువాన్ ప్రాంతంలోనే మృతులు 21,500పైగా ఉన్నారని, మరో 14 వేల మంది భూసమాధి అయినట్టు ప్రకటించింది. చైనా అధ్యక్షుడు హ్యూ జింటావో, ప్రధాని వెన్ జియాబావోలు స్వయంగా పర్యవేక్షిస్తూ సహాయక చర్యలను వేగవంతం చేస్తున్నారు.
దీనిపై అధ్యక్షుడు మాట్లాడుతూ... 1949 సంవత్సరం తర్వాత అంతటి ప్రకృతి ప్రళయం ఇదేనని చెప్పారు. 1949లో తంగ్షన్, 1976లో ఉత్తర హెబైయ్ ప్రొవియన్స్లో సంభవించిన భూకంపాలు సంభవించాయి. మూడు దశాబ్దాల క్రితం సంభవించిన హెబాయ్ ప్రొవియన్స్లో 2.40 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు.
|