బంగ్లాదేశ్ ఆర్మీ మాజీ చీఫ్ ముస్తాఫిజుర్ రెహ్మాన్ను అవినీతి కేసులో ఆ దేశ పోలీసులు అరెస్టు చేశారు. ఆనారోగ్యంతో బాధపడుతూ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన్ను కోర్టు ఆదేశం మేరకు అరెస్టు చేసినట్టు చెప్పారు. ఏడు సంవత్సరాల కిందట జరిగిన అవినీతి కేసులో ఐదు రోజుల క్రితం కోర్టు అరెస్టు వారెంట్ జారీ చేసిందని పోలీసులు తెలిపారు. ఆయన్ను అరెస్టు చేసిన అనంతరం పోలీసుల కస్టడీలో ఆపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
రష్యాకు చెందిన మిగ్-29 రకం విమానాలను నిబంధనలకు వ్యతిరేకంగా కొనుగోలు చేశారు. వీటి కొనుగోళ్ళలో మాజీ ప్రధాని షేక్ హసీనాతో ఆర్మీ మాజీ చీఫ్ రెహ్మాన్ అవినీతికి పాల్పడినట్టు ఆరోపణలు వచ్చాయి. మొత్తం 700 కోట్ల టకా (రూ.420 కోట్లు)ల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసినట్టు అభియోగాలు నమోదయ్యాయి. వీటికి సంబంధించి కోర్టు అరెస్టు వారెంట్ జారీ చేయగా, ప్రత్యేక పోలీసు బృందం ఆస్పత్రికి వెళ్లి రెహ్మాన్ను అరెస్టు చేసింది.
గుండె నొప్పి కారణంగా ఆయన గత వారం రోజులుగా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని ఆయన సమీప కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ కేసులో హసీనా, రెహ్మాన్ ఎయిర్ మాజీ చీఫ్ జమాలుద్దీన్ అహ్మద్, మరో నలుగురు పేర్లు ఉన్నాయి. గత 1996-2001 సంవత్సరంలో అధికారంలో ఉన్న అవామీ లీగ్ ప్రభుత్వంలో రెహ్మాన్, అహ్మద్లు ఆర్మీ, ఎయిర్ఫోర్స్ చీఫ్లుగా ఉన్నారు.
|